తెలంగాణలో ఈడీ అధికారులు మరోసారి దూకుడు ప్రదర్శించారు. తాజాగా ఇవాళ తెల్లవారుజాము నుంచే దాడులకు దిగారు ఈడీ అధికారులు. రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది ప్రాంతాల్లో సోదాలు చేస్తుండగా.. ఒక్క హైదరాబాద్ లోనే ఆరు చోట్ల తనిఖీలు చేయడం విశేషం. గొర్రెల పంపిణీ కేసులో కూపీ లాగేందుకు ఈ దాడులు చేపడుతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ హయాం లో జరిగిన గొర్రెల పంపిణీ స్కామ్ కేసులో దాదాపు రూ. 700 కోట్లు అవినీతి జరిగిందంటూ గతంలో ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఇక ఇప్పటికే ఏసీబీ పలువురిని అరెస్టు చేసి రిమాండ్ కు కూడా తరలించారు. ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. ఇప్పటికే గొర్రెల స్కీంకు సంబంధించిన పూర్తి వివరాలు ఈడీ అధికారులు తెప్పించుకున్నారు. పలువురు అధికారులను సైతం విచారించారు. విచారణలో వారు వెల్లడించిన వివరాల ఆధారంగా తాజాగా తనిఖీలు చేస్తున్నారు. ఇందులో ఎంత అవినీతి జరిగింది అనేది తేటతెల్లం చేయనున్నారు.