బిగ్‌ డీల్‌ : జియోలో పదిశాతం వాటా కొన్న ఫేస్‌బుక్‌

-

జియోలో 9.99 శాతం వాటాలు కొనుగోలు చేయడం ద్వారా ఫేస్‌బుక్‌ సాంకేతిక రంగంలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిదారుగా అవతరించింది.

ప్రఖ్యాత సోషల్‌ మీడియా దిగ్గజం ‘ఫేస్‌బుక్‌’ , భారత టెలికాం అగ్రగామి రిలయన్స్‌ జియోలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టింది. తద్వారా సాంకేతిక రంగంలో అల్ప వాటా కొనుగోలుకు ప్రపంచంలోనే అత్యధిక పెట్టుబడి పెట్టిన సంస్థగా అవతరించింది. అలాగే, భారత్‌లో ఇదే అతిపెద్ద సాంకేతిక రంగ పెట్టుబడిగా నిలిచింది.

రిలయన్స్‌ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌ నికర విలువను రెండు కంపెనీలు  4.62 లక్షల కోట్ల రూపాయలు ( 65.95 బిలియన్‌ డాలర్లు) గా నిర్ధారించుకున్న తర్వాత, రూ. 43,574 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టి వాటాలు కొనుగోలు చేయబోతున్నట్లు ఫేస్‌బుక్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పెట్టుబడి రిలయన్స్‌ జియోలో 9.99 శాతంగా తేలింది.

ఫేస్‌బుక్‌ తన ప్రకటనలో, ‘‘ ఈ రోజు మేము భారత్‌కు చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో భాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌లో 5.7 బిలియన్‌ డాలర్లు లేదా 43,574 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టి, ఫేస్‌బుక్‌ను దాని అతిపెద్ద అల్పవాటాదారులమయ్యామని తెలుపుటకు సంతోషిస్తున్నాము ’’ అని తెలిపింది.

ఆ వెంటనే రిలయన్స్‌ కూడా ఒక ప్రకటన చేసింది. ‘‘ రిలయన్స్‌ జియో ప్లాట్‌ఫామ్స్‌ నికర విలువను 65.95 బిలియన్‌ డాలర్లుగా అంగీకరించి, అందులో 9.99 శాతం వాటాను ఫేస్‌బుక్‌కొనుగోలు చేసింది. డాలర్‌తో రూపాయి మారకాన్ని రూ. 70గా ఒప్పుకుని, రూ. 43,574 కోట్లను ఫేస్‌బుక్‌ పెట్టుబడిగా పెట్టింది. భారత సాంకేతిక రంగంలో ఇదే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా, అలాగే సాంకేతిక రంగంలో అల్ప వాటాకు అత్యధిక పెట్టుబడిగా కూడా అవతరించింది.  ఈ భాగస్వామ్యం పట్ల రిలయన్స్‌ సంస్థ తన సంతోషాన్ని ప్రకటిస్తోంది. 130 కోట్ల భారతీయులకు అన్ని రకాల అభివృద్ధి ఫలాలు అందజేయడం, డిజిట్‌ ఇండియా, మేకిన్‌ ఇండియాలో చురుగ్గా పాలుపంచరకోవడం ద్వారా భారత అర్థిక రంగానికి ఎంతో మేలు చేసే విధంగా ఈ భాగస్వామ్యం ఉండబోతోంది.’’ ఇది ఆ ప్రకటన సారాంశం.

ఫేస్‌బుక్‌, వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌కు తనకు అతిపెద్ద మార్కెట్‌ అయిన భారత్‌లో పెద్దయెత్తున కార్యకలపాలు నిర్వహించేందుకు ఈ డీల్‌ బాగా ఉపయోగపడే అవకాశాలున్నాయి. ఇండియాలో వాట్సప్‌కు 40 కోట్లకు పైగా వినియోగదారులున్నారు. అలాగే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు తన అప్పులను కూడా కొంతమేర తీర్చుకునే అవకాశం దీంతో లభించింది.

 

Read more RELATED
Recommended to you

Latest news