దెయ్యం నౌక.. ఎవర్ని వదల్లేదు.. ఎక్కితే ప్రాణాలు పోవాల్సిందే..!

-

నౌకలకు సంబంధించిన దెయ్యం స్టోరీ ఇది.. ఇలాంటి రకమైనా కథలమీద ఆసక్తి ఉన్నవారికి ఈ కథనం బాగా ఉపయోగపడుతుంది. ఇంకెందుకు ఆలస్యం స్టోరీలోకి వెళ్లిపోదాం.. మిస్ కాకుండా.. మొత్తం చదివితే.. మీకేమైనా.. కారణం తెలిసి ఉండొచ్చు.. బాగా ఏకాగ్రతగా చదవండే..!
రష్యాకి చెందిన ఇవాన్ వాస్సిలీ (Ivan Vassili) నౌక.. మనుషులు ప్రయాణించేది కాదు. సరుకులను తీసుకెళ్లే ఫ్రైటర్. నిజానికి ఇదో అందమైన, ఆకర్షణీయమైన నౌక. దీన్ని 1897లో సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో తయారుచేశారు. బాల్టిక్ సముద్రం నుంచి ఫిన్లాండ్ గల్ఫ్ వరకూ ఫ్రైట్ రవాణా చేసేందుకు దీన్ని తయారుచేశారు.. ఇది గంటకు 8 నాట్ల వేగంతో వెళ్లేది. దీని లోపల బంకర్లలో భారీగా బొగ్గును నిల్వచేసే ఛాన్స్ ఉంది. ఆ బొగ్గుతో ఇది ఒకేసారి 4వేల కిలోమీటర్లు సముద్రంపై ప్రయాణించగలదు. నౌక డెక్ మొత్తం కలపతో అత్యంత అందంగా తయారుచేశారు. అందువల్ల ఈ నౌక సముద్రంలో వెళ్తున్నప్పుడు చూస్తే.. ఎంతో అందంగా.. చూపుతిప్పుకోలేని విధంగా ఉంటుంది. మొదటి ఐదేళ్ల పాటూ దీని ప్రయాణాల్లో ఎలాంటి సమస్యలూ రాలేదు. ఆ తర్వాతే సమస్య మొదలైంది.

ప్రాణాంతకంగా మారిన నౌక:

 ఈ నౌక అందులో ప్రయాణించేవారి పాలిట మృత్యువులా మారింది. 1903లో రష్యా ప్రభుత్వం.. జపాన్‌తో యుద్ధానికి సిద్ధమైంది. రాత్రికి రాత్రి నౌకలో సాధారణ సరుకుల్ని తొలగించి.. యుద్ధ సామగ్రిని నింపారు. వ్లాడివోస్టోక్‌లో ఉన్న రష్యా యుద్ధ నౌకలకు యుద్ధ సామగ్రిని మోసుకెళ్లేందుకు ఈ నౌకను ప్రభుత్వం రంగంలోకి దింపింది. ఈ నౌక నార్త్ సీ నుంచి అట్లాంటిక్ వైపు వెళ్లి.. ఆ తర్వాత ఆఫ్రికాలోని వెస్ట్ కోస్ట్ వైపు వెళ్లింది. నెక్ట్స్ కేప్‌టౌన్ దగ్గరకు చేరి.. అక్కడి నుంచి ఆఫ్రికా తూర్పువైపున జాంజిబార్ చేరింది. నౌక బంకర్లలో బొగ్గు అయిపోతుంటే.. అక్కడ మరిన్ని బొగ్గు సంచులను నింపారు. ఆ తర్వాత.. హిందూ మహాసముద్రంలో ప్రయాణం సాగించింది. అప్పుడే జరిగింది ఇది..
నౌక సముద్రంలో వెళ్తున్నప్పుడు అందులో సిబ్బందికి డౌట్ వచ్చింది. ఆ నౌక.. బొగ్గులపై ఆధారపడి వెళ్లట్లేదని అనిపించింది. మరికొంత మంది ఏదో శక్తి నౌకను ముందుకు నడిపిస్తోందని అనుకున్నారు. ఇంకొందరు… నౌకలోకి ఏదో అసాధారణమైనది వచ్చింది అని భావించారు. అదేంటి అనేది ఎవరికీ అర్థం కాలేదు. నౌక సముద్రంలో బానే వెళ్తున్నప్పటికీ.. ఈ డౌట్స్ అన్నీ వచ్చేసరికి.. అందులో ప్రయాణిస్తున్నవారికి భయం మొదలైంది. రాత్రి వేళ ఏదో తమను చూస్తోందని వాళ్లు భావించారు. ఆ విచిత్రమైనది తమ దగ్గరకు రాగానే.. ఉన్నట్టుండి గాలి ఐస్‌లా చల్లగా అనిపించేది. వెన్నులో వణుకు పుట్టేది. కొన్ని రోజుల వరకూ వారికి ఇలాంటి విచిత్రమైన అనుభవాలు కలిగాయట. ఆ తర్వాత జరిగిందంటే..

 నౌకలో వింత దృశ్యం:

నౌక డెక్‌లో ఉన్నవారు రాత్రివేళ నౌకలోని గడియారంలో మార్పులు చేస్తూ ఉండగా.. వారికి డెక్ దగ్గర ఏదో వింత ఆకారం కనిపించింది. అది చూడటానికి మనిషి లాగా ఉంది కానీ.. దాని లక్షణాలేవీ వాళ్లకు తెలియట్లేదు. మంచులా ఉంది, మెరుస్తోంది, కాంతి వెలిగీ ఆరుతున్నట్లు అవుతోంది. అది అలా కాసేపు డెక్‌ అంతటా తిరిగి.. చివరకు లైఫ్ బోట్ వెనక్కి వెళ్లి కనిపించకుండా మాయమైందట. నౌకలో సిబ్బంది దాన్ని చూసి ఆశ్చర్యపోయారు. దాని వల్ల ఏమైనా అవుతుందేమో అని భయపడ్డారు.. కానీ అలా ఏమీ జరగలేదు. నౌక చైనాలోని పోర్ట్ ఆర్థర్ మిలిటరీ బేస్ చేరింది. అక్కడ నౌకలో మళ్లీ బొగ్గు నింపాలని సిబ్బంది అనుకున్నారు. అప్పుడు మళ్లీ ఓ వింత ఘటన..
నౌక బొగ్గు నింపుకొని.. తిరిగి సముద్రంలో ప్రయాణం సాగించింది. అంతలో సిబ్బందిలో ఒకరు గట్టిగా అరిచారు. అలా అరుస్తూ ఉంటే.. మిగతా సిబ్బంది ఎందుకో తెలియక ఆశ్చర్యంగా చూశారు. కాసేపటికి వాళ్లలో వాళ్లు కొట్టుకోవడం మొదలుపెట్టారు. కొంతసేపు కొట్టుకున్నాక.. వాళ్లలో ఒకడైన అలెక్ గోవిన్‌స్కీ.. తనకు తానుగా సముద్రంలో దూకి చనిపోయాడట. ఆ తర్వాత నౌకలో వారంతా కళ్లు తిరిగి లోపలే పడిపోయారు. తిరిగి లేచాక ఏమీ జరగలేదు. నౌక ప్రశాంతంగా వ్లాడివోస్టాక్ వైపు ప్రయాణం సాగిస్తోంది. ఒకరు చనిపోయినా… మిగతా వాళ్లకు ఏం కాలేదులే అని వారంతా ఊపిరి పీల్చుకున్నారు. రెండ్రోజులు ప్రయాణం బాగానే సాగింది. ఆ తర్వాత మళ్లీ సమస్య మొదలయ్యాయి.

 మూడో రోజు మళ్లీ

మూడో రోజు నౌకలో వారంతా అరవడం, కొట్టుకోవడం, వింతవింతగా ఊగడం వంటివి చేశారు. ఆ తర్వాత అంతా మళ్లీ కళ్లు తిరిగి పడిపోయారు. కొన్ని నిమిషాల తర్వాత లేచారు. ఎవరికీ ఏం కాలేదులే అనుకున్నారు. కానీ వాళ్లలో ఓ వ్యక్తి కనిపించట్లేదని అర్థమైంది. అలా మూడో రోజు కూడా ఓ వ్యక్తి సముద్రంలో దూకి చనిపోయాడు. ఆ తర్వాత నౌక వ్లాడివోస్టాక్ చేరింది. మిగిలివున్న 12 మంది సిబ్బంది నౌకను వదిలి బయటకు వచ్చేశారు. కానీ ఆ పోర్టులో సెక్యూరిటీ వాళ్లు వాళ్లను బయటకు వదల్లేదు. దాంతో వాళ్లు తిరిగి ప్రయాణం సాగించక తప్పలేదు. ఆ నౌక హాంకాంగ్ వైపు సాగింది..

కంటిన్యూ అయిన మరణాలు

నౌక బయలుదేరిన రోజు రాత్రి మళ్లీ పీడకల లాంటిది వచ్చింది. అందరూ ఊగిపోయారు. ఒకరు చనిపోయారు. మర్నాడు మళ్లీ సీన్ రిపీట్. మరో మరణం. మూడో రోజు ఏమీ కాకుండానే ఓ వ్యక్తి భయంతో చనిపోయాడు. ఆ నౌక హాంకాంగ్ చేరుకునే సమయంలో.. కెప్టెన్ స్వెన్ ఆండ్రిస్ట్ (sven andrist) తనకు తానుగా సముద్రంలో దూకి చనిపోయాడు. నౌక రేవులో డాక్ అవ్వగానే.. సెకండ్ ఆఫీసర్ క్రైస్ట్ హాన్సెన్, మరో ఐదుగురు స్కాండినేవియా సభ్యులు తప్ప మిగతా వారంతా పారిపోయారు. హాన్సెన్‌కి దెయ్యాలపై నమ్మకం లేదు. అందువల్ల అతన్ని నౌక కెప్టెన్‌గా చేశారు. కొత్తగా సిబ్బందిని నియమించుకున్నారు. తిరిగి నౌక ప్రయాణం మొదలైంది. ఈసారి నౌక హాంకాంగ్ నుంచి ఆస్ట్రేలియాలోని సిడ్నీవైపు బయలుదేరింది.

సముద్రంలో కలిసిన ప్రాణాలు:

హాన్సెన్ కెప్టెన్‌గా బాగానే పనిచేశాడు. కానీ..నౌక సిడ్నీకి చేరుతున్న సమయంలో.. అతను తన రివాల్వర్ బయటకు తీసి.. తనకు తానుగా కాల్చుకొని చనిపోయాడు. దాంతో నౌకలోని సిబ్బంది.. నౌక సిడ్నీ చేరగానే పారిపోయారు. బోట్స్ వాయన్ హారీ నెల్సన్ మాత్రం పారిపోలేదు. మరో కెప్టెన్‌ని వెతికే పనిలో పడ్డాడు నెల్సన్. అతనికి 4 నెలల వరకూ కెప్టెన్ దొరకలేదు. ఆ తర్వాత కొత్త కెప్టెన్ సారధ్యంలో నౌక సిడ్నీ నుంచి శాన్‌ ఫ్రాన్సిస్కోకి ప్రయాణం మొదలుపెట్టింది. వారం వరకూ బాగానే సాగింది. ఆ తర్వాత సిబ్బంది అరుపులు, కేకలు. వారిలో ఇద్దరు నౌక డెక్ లోనే చనిపోయారు. మర్నాడు కొత్త కెప్టెన్.. రివాల్వర్‌ని నోట్లో పెట్టుకొని ట్రిగ్గర్ నొక్కాడు. చనిపోయాడు. అసలు వీళ్లు అందరూ ఇలా ఎందుకు చనిపోతున్నారో ఎవరికి తెలియటం లేదు.
ఇక లాభం లేదనుకున్న నెల్సన్.. నౌక ప్రయాణాన్ని మధ్యలో ఆపేసి.. తిరిగి రష్యాలోని వ్లాడివోస్టోక్‌కి వెళ్లేలా చేశాడు. నౌక ఆ నగరాన్ని చేరగానే నెల్సన్ సహా అందులో వారంతా దిగిపోయారు. ఆ తర్వాత ఎవరూ దాన్లోకి వెళ్లలేదు. కొన్నేళ్లపాటూ అది అక్కడే అలా ఉండిపోయింది. నౌకలో జరిగిన విషయం అందరికి తెలియటంతో..ప్రజలు దాన్ని అలా ఉంచటం మంచిది కాదు..తగలెట్టేయాలి అనుకున్నారు. అలానే.. 1907 చలికాలంలో.. రాత్రివేళ నౌకను తగలబెట్టారు. అది చూసి ప్రజలు పండుగ చేసుకున్నారు. పాటలు పాడారు. మెల్లమెల్లగా నౌక అంతా కాలిపోయింది.
ఒక రోజంతా కాలిన నౌక.. తర్వాత మెల్లగా సముద్రంలో మునిగిపోయింది. నౌక మునిగిపోయేటప్పుడు ఓ భయంకరమైన ఏడుపును తాము విన్నామని కొందరు చెప్పారు. ఐతే.. ఈ నౌకలో ఇలా ఎందుకు జరిగింది అన్నది ఈరోజుకి ఎవరికీ తెలియలేదు. నిజంగానే ఇలా జరిగిందా అన్నదానిపై కూడా ఆధారాలు లేవు. ఇదో మిస్టరీగా మారింది. నౌకల్లో ఇదో భయంకరమైన దెయ్యం నౌకగా మాత్రం గుర్తింపు పొందింది.
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news