చైనా టెస్ట్ కిట్లు ఇప్పడే వాడొద్దు.. ఐసీఎంఆర్‌ కీలక ఆదేశాలు..

-

వేగవంతమైన కరోనా నిర్ధారణ పరీక్షల కోసం చైనా నుంచి దిగుమతి చేసుకున్న ర్యాపిడ్ టెస్ట్ కిట్ల‌ ఇప్పుడే వాడ‌కూడ‌ద‌ని ఐసీఎంఆర్ పలు రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేసింది. రెండు రోజుల పాటు వాటిని వినియోగించరాదని తెలిపింది. రాపిడ్ టెస్ట్ కిట్ల పనితీరు సరిగా లేదని ఫిర్యాదులు అందడంతో ఐసీఎంఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. రాష్ట్రాల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నట్టు ఐసీఎంఆర్ పేర్కొంది. రానున్న రెండు రోజుల్లో ఈ కిట్ల వాడకానికి సంబంధించి మార్గదర్శకాలు ప్రకటించనున్నట్టు తెలిపింది.

రోజువారి మీడియా సమావేశంలో భాగంగా ఐసీఎంఆర్ ప్రతినిధి డాక్టర్ గంగాఖేద్క‌ర్ మాట్లాడుతూ.. ’చైనా నుంచి దిగుమతి చేసుకున్న రాపిడ్ కిట్ల పనితీరుపై ఒక రాష్ట్రం నుంచి ఫిర్యాదు వచ్చింది. దీంతో వీటి పనితీరుపై మేము మూడు రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపాం. పాజిటివ్ శాంపిల్స్ ఫలితాల కచ్చితత్వంలో చాలా వైవిధ్యాలను గుర్తించాం. ఇంది మంచి పరిణామం కాదు. ఇంత వైవిధ్యం కనిపించినప్పుడు వాటి పనితీరును లోతుగా పరిక్షించాల్సి ఉంది. ఈ టెస్ట్ కిట్ల ద్వారా వెలువడతున్న ఫలితాల కచ్చితత్వాన్ని పరీక్షించడానికి ఐసీఎంఆర్‌కు చెందిన 8 మంది నిపుణల బృందాలను క్షేత్ర స్థాయి పరిశీలనకు పంపుతున్నాం. అందుకే రెండు రోజులపాటు వీటిని ఉపయోగించవద్దని అన్ని రాష్ట్రాలకు అభ్యర్థిస్తున్నాం. అని చెప్పారు.

కాగా, గ‌త నెల‌లో కేంద్ర ప్రభుత్వం చైనా నుంచి 6.5 ల‌క్ష‌ల ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల‌ను తెప్పించింది. కరోనా రెడ్ జోన్లలోని అందరికీ ప‌రీక్షలు చేయడం కోసం ఆ కిట్ల‌ను ఐసీఎంఆర్ ఆయా రాష్ట్రాల‌కు పంపిణీ చేసింది. నాలుగు రోజుల క్రిత‌మే టెస్టింగ్ ప్ర‌క్రియ మొద‌లైంది. అయితే కిట్లు రాగానే వాటి నాణ్య‌త గురించి వదంతులు వ్యాపించాయి. కిట్ల నాణ్య‌త‌లో ఎటువంటి లోపం లేద‌ని చైనా చెప్పింది. కానీ ఆ కిట్ల‌తో జ‌రిపిన ప‌రీక్ష‌ల్లో కేవ‌లం 5.4 శాత‌మే క‌చ్చిత‌మైన ఫ‌లితాలు వ‌స్తున్న‌ట్లు రాజ‌స్థాన్ వెల్ల‌డించింది.

Read more RELATED
Recommended to you

Latest news