పసిఫిక్‌ మహాసముద్రంలో కూలిన రెండు జపాన్‌ సైనిక హెలికాప్టర్లు

-

జపాన్‌కు చెందిన రెండు నావికాదళ హెలికాప్టర్‌లు పరస్పరం ఢీ కొన్నాయి. అనంతరం అవి పసిఫిక్‌ మహా సముద్రంలో కుప్పకూలాయి. టోక్యోకు 600 కిలోమీటర్ల దూరంలోని టొరిషిమా ద్వీపం గగనతలంపై ఎగురుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఓ నావికాదళ అధికారి మరణించారు. మరోవైపు మిగిలిన ఏడుగురు పసిఫిక్‌ మహాసముద్రంలో గల్లంతయ్యారు.

సమాచారం అందుకున్న జపాన్‌ తీర రక్షకదళం, నావికాదళాలు అక్కడికి చేరుకుని వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. 12 యుద్ధనౌకలు, 7 యుద్ధవిమానాలతో పాటు కోస్టుగార్డు బోట్లతో గాలిస్తున్నారు. రాత్రివేళ శిక్షణ ఇస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని జపాన్‌ రక్షణ మంత్రి మినోరు కిహారా వెల్లడించారు. ఒక్కో హెలికాప్టర్‌లో నలుగురు సిబ్బంది ఉన్నట్లు తెలిపారు. హెలికాప్టర్‌లకు చెందిన కొన్ని శిథిలాలు లభ్యమైనట్లు వెల్లడించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయిస్తామని చెప్పారు. నావికాదళ అధికారి మృతి పట్ల సంతాపం ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version