ఇజ్రాయెల్​-హమాస్​ యుద్ధానికి 5 రోజుల పాటు బ్రేక్​!

-

నెల రోజులకు పైగా ఇజ్రాయెల్-హమాస్​లకు మధ్య భీకర పోరు సాగుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధంలో సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైనా ఇరు వర్గాలు సంధి కుదుర్చుకుని ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరుతున్నాయి. అయితే ఎట్టకేలకు ఇజ్రాయెల్-హమాస్​ మధ్య సయోధ్య కుదిరినట్టు కనిపిస్తోంది. గాజాపై ఇజ్రాయెల్ సైన్యం తీవ్రంగా విరుచుకుపడుతూ హమాస్ మిలిటెంట్లను ఏరి పారేస్తున్న వేళ ఉగ్రసంస్థ హమాస్ కీలక ప్రకటన చేసింది.

ఇజ్రాయెల్​తో సంధికి చేరువవుతున్నామని హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియా తెలిపారు. 5 రోజుల పాటు సంధికి ప్రతిపాదనలు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ఐదు రోజులు క్షేత్రస్థాయిలో కాల్పుల విరమణ, దక్షిణ గాజాలో ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు తగ్గించాలని ప్రతిపాదించినట్లు తెలిసింది. ప్రతిగా 50 నుంచి 100 మంది బందీలను హమాస్‌ విడుదల చేయనుందట. విడుదల చేసే బందీల్లో సామాన్య పౌరులు, విదేశీయులు ఉంటారని.. బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ సైనికులను విడుదల చేయబోమని హమాస్ చెప్పినట్లు సమాచారం. ఈ ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న 300 మంది పాలస్తీనా వాసులను విడుదల చేయాలని హమాస్ ప్రతిపాదించినట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news