పెట్రోల్‌, డీజిల్‌ కార్లను వదిలించుకోవడం సాధ్యమే : కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ

-

భారతదేశాన్ని గ్రీన్‌ ఎకనామీగా మార్చడంలో భాగంగా హైబ్రిడ్ వాహనాలపై జీఎస్టీని తగ్గించి.. 36కోట్లకుపైగా పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలను వదిలించుకోవాల్సి ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ కార్లను పూర్తిగా వదిలించుకోవడం భారత్‌కు సాధ్యమేనా? అనే ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ.. ‘వందశాతం. అసాధ్యం కాదు. ఇది నా అభిప్రాయం’ అని జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఇంధన దిగుమతులపై భారతదేశం రూ.16 లక్షల కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. ఈ సొమ్ముతో రైతుల జీవితాలు బాగుపడుతాయని.. గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, యువతకు ఉపాధి లభిస్తుందని గడ్కరీ పేర్కొన్నారు.

గ్రీన్‌ ఎనర్జీ లక్ష్యం సాధించేందుకు ఎలాంటి టైమ్‌లైన్‌ లేదన్నారు. హైబ్రిడ్ వాహనాలపై జీఎస్టీని ఐదు శాతానికి, ఫ్లెక్స్ ఇంజిన్లపై 12 శాతానికి తగ్గించే ప్రతిపాదనను ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపామని, ఈ డిమాండ్‌ను పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. జీవ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా దేశం ఇంధన దిగుమతులను తగ్గించగలదని తాను బలంగా నమ్ముతున్నానన్నారు. తాను 2004 నుంచి ప్రత్యామ్నాయ ఇంధనాలపై దృష్టి పెడుతున్నానని, రానున్న ఐదు నుంచి ఏడేళ్లలో పరిస్థితులు మారతాయని గడ్కరీ విశ్వాసం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news