పొన్నియిన్ సెల్వన్‌లో మెగాస్టార్… చిరుకి థ్యాంక్స్‌ మణిరత్నం అందుకే చెప్పారా!?

-

చోళుల గురించి పొన్నియిన్‌ సెల్వన్‌ రెండు భాగాలు తీయడానికి బాహుబలి తమకు బాటలు పరిచిందని, అందుకు స్టార్‌ డైరెక్టర్‌ రాజమౌళికి కృతజ్ఞతలు అన్నారు ప్రముఖ దర్శకులు మణిరత్నం. ఆయన దర్శకత్వంలో విక్రమ్‌, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్‌, త్రిష కీలక పాత్రల్లో నటించిన ఎపిక్‌ పిరియాడిక్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ ‘పొన్నియిన్‌ సెల్వన్‌-1’ తెరకెక్కనుంది. రెండు భాగాలుగా వస్తున్న ఈ చిత్రం తొలి భాగం సెప్టెంబరు 30న తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. కాగా, శుక్రవారం హైదరాబాద్‌లో ‘చోళ చోళ’ సాంగ్‌ను విడుదల చేశారు.

పొన్నియిన్‌ సెల్వన్‌
పొన్నియిన్‌ సెల్వన్‌

ఈ సందర్భంగా మణిరత్నం మాట్లాడుతూ.. చిరంజీవి గారికి ధన్యవాదాలు. ఎందుకో తర్వాత చెబుతా. ఇక చోళ సామ్రాజ్యం గురించి చెప్పే ‘పొన్నియిన్‌ సెల్వన్‌ లాంటి భారీ చిత్రాన్ని అదీ రెండు భాగాలుగా తీయడానికి మాకు బాటలు పరిచిన రాజమౌళి గారికి కృతజ్ఞతలు. అందుకు కారణం ‘బాహుబలి’. మా సినిమాకు విక్రమ్‌, కార్తి, జయం రవి చాలా చక్కని నటీనటులు దొరికారు. అలాగే టెక్నికల్‌ టీమ్‌ కూడా అద్భుతంగా పనిచేసింది. ఈ సినిమా అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నా అన్నారు.

పొన్నియిన్‌ సెల్వన్‌
పొన్నియిన్‌ సెల్వన్‌

అయితే చిరంజీవికి మణిరత్నం థ్యాంక్స్ చెప్పడం వెనుక ఓ కారణం ఉందని టాక్‌. కానీ ఆయనకు థాంక్స్ ఎందుకు చెబుతున్నానో.. ఇప్పుడే చెప్పనని సస్పెన్స్‌లో పెట్టేశారు. బహుశా చిరంజీవి ఈ సినిమా కోసం వాయిస్ ఓవర్ ఇచ్చి ఉండొచ్చని సమాచారం.

విక్రమ్‌ మాట్లాడుతూ… నాకు మణి సర్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. అప్పుడు రావణ్‌ ఇచ్చారు. ఇప్పుడు పొన్నియిన్‌ సెల్వన్‌. ఆయన సినిమాలో నేను ఉన్నాననంటే అది నా అదృష్టం. శంకర్‌, మణిరత్నం చిత్రాల్లో నటిస్తే హ్యాపీగా రిటైర్‌ అయిపోవచ్చు. ఆ తర్వాత ఏ చిత్రాలు చేయకపోయినా ఫర్వాలేదు. అందరికీ ధన్యవాదాలు అని చెప్పుకొచ్చారు.

కార్తి మాట్లాడుతూ.. పొన్నియిన్‌ సెల్వన్‌ మణిరత్నం గారి కల. గొప్ప నటులు చేయాల్సిన పాత్రను ఆయన నాకు ఇచ్చారు. నాకు చాలా ప్రత్యేకం. కల్కి రాధాకృష్ణ రాసిన పొన్నియిన్‌ సెల్వన్‌ నవల సినిమాగా తీయాలని ఎందరో ప్రయత్నించారు. కానీ, 60ఏళ్ల తర్వాత ఇది సాకారమైంది. ఇది సినిమా కాదు.. హిస్టరీ. ఈ నవలలో ప్రతి పాత్రకూ ప్రత్యేకత ఉంది. కథలో అద్భుమైన డ్రామా ఉంది. ఇదొక విజువల్‌ వండర్‌. ఇలాంటి వాటికి మణి సర్‌, రెహమాన్‌లాంటి గొప్పవారు కావాలి. ఇది ఆనాటి రాజకీయాల గురించి చెబుతుంది. ఇప్పుడూ అలాంటి రాజకీయాలే ఉన్నాయి. చాలా రీసెర్చ్‌ చేసి ఈ కథను సిద్ధం చేశారు. 140 రోజుల్లో పొన్నియిన్‌ రెండు భాగాలు తీయడం నిజంగా అద్భుతం అని కార్తి ఆనందం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో సుహాసిని, ప్రకాశ్‌రాజ్‌, తనికెళ్ల భరణి, దిల్‌రాజు, అనంత శ్రీరామ్‌ తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. ఈ సినిమా తెరకెక్కించడానికి ఆయన చాలా కష్టపడ్డారు. లైకా ప్రొడక్షన్స్ సహాయంతో తన సొంత బ్యానర్ లో ఈ సినిమాను నిర్మించారు మణిరత్నం. ఈ సినిమాలో విక్రమ్, కార్తి, ఐశ్వర్యారాయ్, త్రిష ఇలా చాలా మంది పేరున్న నటీనటులు కనిపించబోతున్నారు. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కూడా వచ్చింది. తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news