జైల్లో ఉండి ఎంపీలుగా విజయం.. లోక్​సభకు వెళ్లొచ్చా?

-

18వ లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులు జైలు నుంచే పోటీ చేసి గెలిచి వార్తల్లో నిలిచారు. వారిలో ఒకరు ఖలిస్తానీ వేర్పాటు వాది అమృత్‌పాల్‌ సింగ్‌ కాగా మరొకరు ఉగ్రవాదులకు నిధులు అందించారని అభియోగాలు ఎదుర్కొంటున్న ఇంజినీర్‌ రషీద్‌. ప్రస్తుతం వీరిద్దరూ జైల్లో ఉండటం వల్ల ఎంపీగా ప్రమాణస్వీకారం చేసేందుకు అనుమతిస్తారా? వారు లోక్‌సభకు వెళ్లొచ్చా? నిబంధనలు ఏం చెబుతున్నాయి?

పంజాబ్‌లోని ఖడూర్‌ సాహిబ్‌ స్థానం నుంచి మృత్‌పాల్‌ సింగ్‌, జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా నుంచి ఉగ్రనిధుల కేసు నిందితుడు ఇంజినీర్‌ రషీద్‌ తాజా లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం వీరు ప్రమాణం చేసేందుకు అర్హులేనని లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్‌, రాజ్యాంగ నిపుణులు పీడీటీ ఆచారి తెలిపారు. మరోవైపు జైల్లో ఉన్న వ్యక్తులు సభా కార్యకలాపాలకు హాజరయ్యేందుకు చట్టం అనుమతించదు. అందువల్ల ఎంపీగా ప్రమాణం చేసిన తర్వాత వారు సభకు హాజరుకాలేకపోవడంపై స్పీకర్‌కు లేఖ రాయాల్సి రాస్తే వారి అభ్యర్థనలను సభాపతి సభ్యుల గైర్హాజరీపై ఏర్పాటైన హౌస్‌ కమిటీకి పంపుతారు. ఈ అభ్యర్థులను అంగీకరించాలా? వద్దా అన్నదానిపై కమిటీ సిఫార్సులు చేస్తుంది.

అయితే ఈ కేసుల్లో వారు దోషులుగా తేలి రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్షను ఎదుర్కొంటే ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రాజ్యాంగ పదవుల్లో ఉండటానికి అనర్హులవుతారు. అప్పుడు లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోతారు.

Read more RELATED
Recommended to you

Latest news