చంద్రుడిపై నీళ్లు.. చంద్రయాన్​-1 డేటాతో వెలుగులోకి సంచలన విషయాలు

-

చంద్రయాన్-3తో జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన భారత్.. జాబిల్లి గట్టు నెమ్మదిగా తెలుసుకుంటోంది. మరోవైపు తాజాగా చంద్రయాన్-1 రిమోట్​ సెన్సింగ్​ డేటా ద్వారా కీలక విషయాలు తెలిశాయి. చంద్రుడిపై నీరు ఎలా ఏర్పడిందన్న విషయంపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలకు ఈ డేటా బ్రేక్ త్రూగా నిలవనుంది. ఈ డేటాను విశ్లేషించిన శాస్త్రవేత్తల బృందం.. భూమి నుంచి విడుదలైన అధిక శక్తి ఎలక్ట్రాన్లు చంద్రుడిపై నీటిని ఏర్పరుస్తున్నట్లు కనుగొన్నారు. భూమి ప్లాస్మా షీట్​లోని ఎలక్ట్రాన్లు చంద్రుడి ఉపరితలంపై రాళ్లు, ఖనిజాలను విచ్ఛన్నం చేయడం, కరిగించడం లాంటి వాతావరణ ప్రక్రియకు కారణం అవుతున్నాయని తెలిపారు.

అమెరికాలోని మానోవాలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్​ హవాయి (యూహెచ్)కు చెందిన శాస్త్రవేత్తల బృందం చేసిన పరిశోధన వివరాలు ‘నేచర్ ఆస్ట్రానమీ’ జర్నల్​లో ప్రచురితం అయ్యాయి. చంద్రుడిపై ఎంత మోతాదులో నీటి వనరులు ఉన్నాయనే విషయం కీలకమని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆ వనరులు ఎలా ఏర్పడ్డాయి, వాటి పరిణామక్రమాన్ని అర్థం చేసుకోడానికి.. భవిష్యత్తులో మానవ అన్వేషణకు నీటి వనరులను అందించడానికి ఉపయోగపడుతుందని చెప్పారు.

చంద్రుడు మాగ్నెటోటైల్ వెలుపల ఉన్నప్పుడు, చంద్ర ఉపరితలాన్ని సౌర గాలి ఢీకొడుతుందని.. మాగ్నెటోటైల్ లోపల, దాదాపు సౌర గాలి ప్రోటాన్‌లు ఉండవని యూహెచ్​ మనోవా స్కూల్​ ఆఫ్​ ఓషన్ అసిస్టెంట్ రీసెర్చర్ షుయ్​ లి తెలిపారు​. నీటి నిర్మాణం దాదాపు సున్నాకు పడిపోతుందని అంచనా వేశారు. కానీ రిమోట్​ సెన్సింగ్ డేటా పరిశీలించినప్పుడు.. చంద్రుడు భూమి మాగ్నెటోటైల్​లో ఉన్నప్పుడు ఏర్పడిన నీరు.. అదే చంద్రుడు మాగ్నెటోటైల్​ వెలుపల ఉన్నప్పుడు ఏర్పడిన నీరు దాదాపు సమానంగా ఉన్నట్లు చూపించిందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news