భారత ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ భారత నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్ గా జ్ఞానేష్ కుమార్ ను నియమించింది. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ దీనిపై కీలక ప్రకటన విడుదల చేసింది. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ పేరును ఖరారు చేసేందుకు సెలక్షన్ కమిటీ సమావేశం నిర్వహించిన కొద్ది గంటల తరువాతనే ఈ ప్రకటన చేశారు. ప్రధాన మంత్రి మోడీతో పాటు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కూడా సీఈసీ ని ఎంపిక చేయడానికి ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల ప్యానెల్ లో సభ్యులుగా ఉన్నారు.
ఈ కమిటీ సౌత్ బ్లాక్ లోని ప్రధానమంత్రి కార్యాలయంలో సమావేశమై.. జ్ఞానేష్ కుమార్ పేరును రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సిఫార్సు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తదుపరి ప్రధాన ఎన్నికల కమిషనర్ గా జ్ఞానేష్ కుమార్ పేరును ఆమోదించారు. ప్రస్తుత సీఈసీ పదవీ విరమణ తరువాత ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. రాజీవ్ కుమార్ ఇవాళ పదవీ విరమణ చేయనున్నారు.