దేశంలో తగ్గుతున్న కరోనా.. గత 24 గంటల్లో కొత్తగా 2,961 కరోనా పాజిటివ్‌ కేసులు

-

దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,961 పాజిటివ్ కేసులు వెలుగుచూసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఇవాళ వెల్లడించింది. అదే సమయంలో 17 మరణాలు చోటు చేసుకోగా… మొత్తం మరణాల సంఖ్య 5,31,659కు చేరింది. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య 30,041గా ఉంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కొవిడ్​పై కీలక ప్రకటన చేసింది.

కొవిడ్‌-19 ఇకపై ప్రపంచ విపత్తు కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) శుక్రవారం ప్రకటించింది. ప్రపంచ విపత్తుగా పరిగణించేంతటి స్థాయిలో దాని ప్రభావం లేదని వెల్లడించింది. గురువారం ఆరోగ్య నిపుణులతో చర్చించిన తర్వాత డబ్ల్యూహెచ్‌వో ఈ ప్రకటన చేసింది. అయితే మహమ్మారి పూర్తిగా అంతం కాలేదని, ఇప్పటికీ అది ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యానికి ముప్పుగా ఉందని తెలిపింది. దాని బారినపడి ప్రతివారం వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొంది. ‘‘మన ప్రపంచాన్ని కొవిడ్‌ మళ్లీ ప్రమాదంలో పడేసే పరిస్థితి ఉందా అన్న విషయంపై నిపుణులతో మరోసారి సమీక్ష జరిపించడానికి నేను వెనుకాడను’’ అని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version