అంబులెన్సు లేక.. బైక్​పైనే తల్లి శవంతో 80 కి.మీ..

-

మధ్యప్రదేశ్ షాహ్​డోల్​లో అమానవీయ ఘటన జరిగింది. చనిపోయిన తల్లిని 80 కిలోమీటర్లు బైక్​పై తీసుకెళ్లాల్సిన గత్యంతరం ఏర్పడింది. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అంబులెన్సు సౌకర్యం లేకపోవడం.. ప్రైవేటు వాహనాన్ని ఏర్పాటు చేసుకునే స్తోమత లేకపోవడం వల్ల.. ఓ వ్యక్తి తన ద్విచక్రవాహనంపైనే తల్లి శవాన్ని మోసుకెళ్లాడు.

ఇదీ జరిగింది..  సుందర్ యాదవ్.. అస్వస్థతకు గురైన తన తల్లిని జిల్లా ఆస్పత్రిలో చేర్చాడు. శనివారం రాత్రి ఆమె ఆరోగ్యం క్షీణించడం వల్ల మెరుగైన చికిత్స కోసం మెడికల్ కాలేజీకి తీసుకొచ్చారు. శనివారం అర్ధరాత్రి తర్వాత ఆమె ప్రాణాలు కోల్పోయింది.

తల్లి చనిపోయిన తర్వాత అంబులెన్సు, లేదా మార్చురీ వాహనం కోసం సిబ్బందిని అడిగామని సుందర్ యాదవ్ తెలిపారు. ‘వాహనాలు అందుబాటులో లేవని ఆస్పత్రి సిబ్బంది చెప్పారు. ప్రైవేటు వాహనం కోసం ప్రయత్నించా. కానీ, వారు రూ.5వేలు డిమాండ్ చేశారు. వాహనానికి రూ.5వేలు పెట్టేందుకు నా వద్ద డబ్బు లేదు’ అని సుందర్ వివరించారు.

అనంతరం, తల్లి మృతదేహాన్ని తానే స్వయంగా తీసుకెళ్లాలని అనుకున్నట్లు సుందర్ చెప్పారు. షాహ్​డోల్ నుంచి అనుప్పుర్ జిల్లాలోని గోదారు ప్రాంతానికి ద్విచక్రవాహనంపై తీసుకెళ్లాడు. బైక్​కు ఓ చెక్కను కట్టి.. దానిపై మృతదేహాన్ని పడుకోబెట్టాడు.

మరోవైపు, ఆస్పత్రి యాజమాన్యం ఈ ఘటనపై స్పందించింది. మృతుడి కుటుంబ సభ్యులు వాహనం కోసం తమను సంప్రదించలేదని ఆస్పత్రి సూపరింటెండెంట్ నాగేంద్ర సింగ్ పేర్కొన్నారు. ‘మృతుల కుటుంబ సభ్యులు అడిగితే వాహనం ఏర్పాటు చేస్తాం. జిల్లా ఆస్పత్రి నుంచి లేదంటే ఇతర ప్రాంతాల నుంచి అంబులెన్సులు తెప్పిస్తాం. కానీ వారు వాహనం కోసం మమ్మల్ని అడగలేదు’ అని చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news