సింగర్‌పై ఎమ్మెల్యే లైంగిక‌దాడి..! కేసు న‌మోదు!

-

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోతోంది. రోజురోజుకూ మ‌హిళ‌ల‌పై లైంగిక‌దాడులు పెరిగిపోతున్నాయి. ఈ క్ర‌మంలోనే మ‌రో దారుణ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. ఏకంగా ఓ ఎమ్మెల్యే, ఆయ‌న కుమారుడు ఓ సింగర్‌పై లైంగిక‌దాడికి పాల్ప‌డిన ఘ‌ట‌న బ‌య‌ట‌కు రావ‌డంతో జ‌నం ఉలిక్కిప‌డుతున్నారు. ఆ ఇద్ద‌రిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్యెల్యేతో సహా మరో ఇద్దరి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేపీ మిత్రపక్షంగా ఉంటున్న‌ నిషద్‌ పార్టీ (నిర్బల్ ఇండియన్ షోషిత్ హమారా ఆమ్ దళ్) ఎమ్మెల్యే విజయ్‌ మిశ్రా ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. పోలీసుల‌కు అందించిన ఫిర్యాదు ప్ర‌కారం వివ‌రాలు ఇలా ఉన్నాయి. 2014లో విజయ్‌ మిశ్రా ఓ కార్యక్రమం కోసం 25 ఏళ్ల సింగర్‌ని తన ఇంటికి పిలిచాడు.

ఈ క్రమంలో విజయ్‌ మిశ్రా, అతడి కుమారుడు ఆ సింగ‌ర్‌పై లైంగిక‌దాడి చేశారు. ఈ విష‌యం ఎవ‌రికైనా చెబితే చంపేస్తానంటూ ఎమ్మెల్యే తనను బెదిరించాడని బాధితురాలు ఆరోపించింది. అంతేగాకుండా.. 2015లో వారణాసిలో ఒక హోటల్‌లో ఎమ్మెల్యే మరో సారి బాధితురాలిని బెదిరించి అత్యాచారం చేశాడని బధోహి ఎస్పీ రామ్‌ బదన్‌ సింగ్‌ తెలిపారు. అనంతరం ఆమెపై కొడుకు, మేనల్లుడు లైంగిక‌దాడి చేశారని బాధితురాలు తన ఫిర్యాదులో తెలిపిందన్నారు ఎస్పీ. ఇదిలా ఉండ‌గా.. భూమిని ఆక్రమించుకున్నాడన్న కేసులో అరెస్టయ్యి ప్రస్తుతం మిశ్రా జైలులో ఉన్నాడు. ఈ విషయం తెలియడంతో సింగర్‌ అతని మీద గోపిగంజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కావడంతో ఫిర్యాదు చేయడానికి తాను భ‌య‌ప‌డ్డాన‌ని ఆమె పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news