కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో మోత్కుపల్లి భేటీ.. వచ్చే నెలలో కాంగ్రెస్ లోకి..!

-

మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. తాజాగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో మోత్కుపల్లి నర్సింహులు భేటీ అయ్యారు. అక్టోబర్ మొదటి వారంలో మోత్కుపల్లి నర్సింహులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొనే అవకాశం ఉంది.2009 అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి నుండి మోత్కుపల్లి నర్సింహులు టీడీపీ అభ్యర్ధిగా విజయం సాధించారు.

2014 ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మధిర అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలలో మోత్కుపల్లి నర్సింహులు టీడీపీని వీడి బీజేపీలో చేరారు. దళితబంధు పథకంపై సీఎం కేసీఆర్ ను మోత్కుపల్లి నర్సింహులు ప్రశంసలు కురిపించారు. అయితే గత నెలలో కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో మోత్కుపల్లి నర్సింహులుకు చోటు దక్కలేదు. దీంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు.

1983లో టీడీపీ ఆవిర్భావ సమయంలో  ఆ పార్టీ ద్వారా మోత్కుపల్లి నర్సింహులు రాజకీయరంగ ప్రవేశం చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని  ఆలేరు అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ, కాంగ్రెస్, ఇండిపెండెంట్ అభ్యర్థిగా  మోత్కుపల్లి నర్సింహులు  విజయం సాధించారు.ఇటీవలనే  చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ ఎన్టీఆర్ ఘాట్ వద్ద మోత్కుపల్లి నర్సింహులు  ఒక్క రోజు దీక్ష చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో  తుంగతుర్తి అసెంబ్లీ స్థానం నుండి మోత్కుపల్లి నర్సింహులు పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news