రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లిలోని 400 ఎకరాల కంచ గచ్చిబౌలి భూములపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రకృతిని ధ్వంసం చేసి వన్యప్రాణులను చంపుతున్నారని ఆరోపించారు.
అడవులపై బుల్డోజర్లు నడిపించడంలో.. తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ బిజీగా ఉందని ఘాటు కామెంట్స్ చేశారు. తాము పర్యావరణాన్ని కాపాడుతుంటే.. వాళ్లు అటవీ సంపదను సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు. గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ నాయకులు మోసం చేశారని విమర్శించారు.
తెలంగాణలో ఇప్పటికే కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. 400 ఎకరాల భూమి తెలంగాణ ప్రభుత్వానికి చెందినదని టీజీఐఐసీ ఇటీవల ప్రకటన విడుదల చేయడంతో దుమారం రేగింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. పచ్చని భూములపై బుల్డోజర్లు పంపి చెట్లను విధ్వంసం చేసి వణ్యప్రాణులకు నిలువ నీడ లేకుండా చేస్తున్నారనంటూ సర్కారుపై తీవ్రంగా మండిపడ్డాయి. ఈ వ్యవహారం కాస్త తెలంగాణ హైకోర్టు, సుప్రీంకోర్టుకు చేరడంతో న్యాయస్థానం జోక్యం చేసుకుని ఓ కమిటీని నియమించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.