‘ట్రాక్టర్‌ కవాతులో వాళ్లను చంపేందుకు కుట్ర’

-

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లి సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతు సంఘాలు ఓ సంచలన ఆరోపణ చేశారు. నెల 26న నిర్వహించనున్న ట్రాక్టర్‌ కవాతులో తమలోని నలుగురికి హత్యచేసి ఆందోళనను భగ్నం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయన్నారు. ఈ ప్రణాళికలో పాలుపంచుకుంటున్న ఓ ముసుగు తొడిగిన వ్యక్తిని శుక్రవారం రాత్రి పట్టుకుని మీడియా ముందు ఉంచినట్లు వారు పేర్కొన్నారు. పోలీస్‌ అధికారిగా కవాతులో పాల్గొని రైతలుపై లాఠీచార్జి చేయాలని అతడికి ఆదేశాలు ఉన్నట్లు ఆరోపించారు.

మీడియా సమావేశం అనంతరం ఆ వ్యక్తిని హరియాణా పోలీసులకు అప్పగించినట్లు నాయకుల్లో ఒక్కరైన కుల్వంత్‌ సింగ్‌ సంధు తెలిపారు. ఈ విషయాన్ని బయటకు చెబితే కుటుంబ సభ్యులను సైతం చంపేస్తామని ఈ కుట్రలో పాల్గొనే వ్యక్తులను హెచ్చరించినట్లు తెలిపారు. అయితే.. దిల్లీ పోలీసుకు మాత్రం తమకు ఎలాంటి ముసుగు తొడిగిన వ్యక్తి సమాచారం అందలేదని.. ఎవరూ తమకు ఫిర్యాదు చేయలేదని అంటున్నారు.

11వ సారి చర్చలు..

రైతులు తాము పట్టుకున్నట్లు చెప్పిన ముసుగు తొడిగిన వ్యక్తి మీడియాతో మాట్లాడతూ.. ‘రైతులు 26న నిర్వహించనున్న ట్రాక్టర్ల ర్యాలీని అడ్డుకోవాలని నిర్ణయించాం. మొదట గాల్లోకి కాల్పులు జరిపి.. ఆ తర్వాత మాలో కొందరు వెనక నుంచి కాల్పులు జరుపుతారు. అక్కడున్న పోలీసులు, రైతులే కాల్పులు జరుపుతున్నారని భావించి ఎదురు కాల్పులు జరుపుతారు’ అని చెప్పుకొచ్చాడు. కేంద్రం, రైతు సంఘాలతో శుక్రవారం 11వ సారి జరిపిన చర్చలు ఎలాంటి ఫలితాలు లేకుండానే ముగిసాయి.

అయితే.. చట్టాల అమలును మాత్రం రెండేళ్లు వాయిదా వేస్తామని కేంద్రం ప్రతిపాదించినట్లు సమాచారం. రైతులు మాత్రం చట్టాలను పూర్తిగా వెనక్కి తీసుకోవాలని పట్టుబట్టగా.. రద్దు డిమాండ్‌ను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేదే లేదని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వం వైఖరి సరిగా లేకపోవడంతో తమ పోరాటం మరింత ఉద్ధృతం చేసేందుకు జనవరి 26న ట్రాక్టర్‌ కవాతు నిర్వహిస్తామని కిసాన్‌ మోర్చా ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news