BIG BREAKING : బిహార్ సీఎం నితీశ్ రాజీనామా

-

బిహార్ ముఖ్యమంత్రి పదవికి నితీశ్ కుమార్ రాజీనామా చేశారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తో కలిసి రాజ్ భవన్ చేరుకున్న నితీశ్.. గవర్నర్ చౌహాన్ కు రాజీనామా లేఖ సమర్పించారు. దీంతో బీజేపీతో సంకీర్ణ ప్రభుత్వం రెండేళ్లైనా అధికారం పూర్తి చేసుకోకుండా కుప్పకూలినట్లైంది. బీజేపీ హైకమాండ్ పట్ల కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న జేడీ(యూ) నేత ఎన్డీఏ నుంచి బయటకు వస్తే.. తాము మద్దతిస్తామని మిత్రపక్షాలైన ఆర్జేడీ, కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించాయి.

 

అనుకున్నట్టే జరిగింది. నితీశ్​ కుమార్​ ఎత్తుగడతో బిహార్ రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. మిత్రపక్షం భాజపాకు రెండోసారి షాక్ ఇచ్చింది జనతాదళ్​ యునైటెడ్​(జేడీయూ). జాతీయ ప్రజాస్వామ్య కూటమి నుంచి నిష్క్రమించింది. ఇప్పటివరకు ప్రత్యర్థులుగా ఉన్న రాష్ట్రీయ జనతా దళ్​(ఆర్​జేడీ), కాంగ్రెస్​, వామపక్షాలతో కూడిన మహాకూటమితో జట్టు కట్టింది. ఆ పార్టీలతో కలిసి సరికొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది నితీశ్​ సేన. ఇందుకు అనుగుణంగా.. ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగారు

నితీశ్ కుమార్. మంగళవారం పట్నాలో గవర్నర్​ ఫాగూ చౌహాన్​ను కలిసి రాజీనామా లేఖ అందజేశారు. మహాకూటమితో కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం కల్పించాలని కోరారు. నితీశ్​కు మద్దతు తెలుపుతూ ఆర్​జేడీ నేత తేజస్వీ యాదవ్​ ఇచ్చిన లేఖను సమర్పించారు.

నితీశ్​ రాజీనామా ప్రకటనకు ముందు.. హైఓల్టేజ్ రాజకీయానికి వేదికైంది బిహార్. ప్రధాన పార్టీలన్నీ విడివిడిగా సమావేశాలు నిర్వహించి.. భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించాయి. జేడీయూ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పట్నాలో భేటీ అయ్యారు నితీశ్.

“ముందు చిరాగ్ పాసవాన్ తిరుగుబాటు, తర్వాత ఆర్​సీపీ సింగ్ రూపంలో జేడీయూను బలహీనపరిచేందుకు భాజపా ప్రయత్నించింది. కూటమి నుంచి నేను వైదొలగాల్సిన పరిస్థితిని భాజపానే సృష్టించింది” అని పార్టీ నేతలకు నితీశ్​ చెప్పినట్లు తెలిసింది. సానుకూలంగా స్పందించిన జేడీయూ ఎమ్మెల్యేలు, ఎంపీలు.. నితీశ్​ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం.

అదే సమయంలో.. ఆర్​జేడీ నేతృత్వంలోని మహాకూటమి పార్టీల నేతలు పట్నాలోని రబ్రీ దేవి నివాసంలో సమావేశమయ్యారు. పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే అధికారాన్ని తేజస్వీ యాదవ్​కు అప్పగించారు ఆర్​జేడీ, కాంగ్రెస్​, వామపక్షాల నేతలు. “కొత్త ప్రభుత్వంలో మంత్రుల శాఖల కేటాయింపులో జేడీయూతో ఎలాంటి ఇబ్బందులు లేవు. మనందరికీ కలిపి 160 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. రాష్ట్రంలో రాజకీయ అస్థిరత సృష్టించేందుకు లేదా రాష్ట్రపతి పాలన విధించేందుకు భాజపా ప్రయత్నిస్తే.. మనం దీటైన జవాబు ఇవ్వొచ్చు” అని ఈ సందర్భంగా తేజస్వీ మహాకూటమి నేతల వద్ద ధీమా వ్యక్తం చేసినట్లు తెలిసింది. మరోవైపు.. లౌకిక శక్తులకు అండగా నిలవాలనే భాజపాయేతర ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది కాంగ్రెస్.

Read more RELATED
Recommended to you

Latest news