ఆ ఏడుగురు సిట్టింగులని ఎందుకు మార్చారంటే?

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం మాత్రమే ఉంది..అయితే ఎన్నికల షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు..కానీ ఈలోపే కే‌సి‌ఆర్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. మళ్ళీ అధికారం కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. ఈ క్రమంలోనే బి‌ఆర్‌ఎస్ అభ్యర్ధుల మొదట లిస్ట్ విడుదల చేశారు. 119 సీట్లకు గాను..115 మంది అభ్యర్ధులని ప్రకటించారు. ఇందులో దాదాపు అందరి సిట్టింగులకు సీట్లు ఇచ్చారు.

కేవలం 7 స్థానాల్లోనే మార్పులు చేశారు.  వేములవాడ, ఖానాపూర్, ఆసిఫాబాద్, ఉప్పల్, బోథ్, స్టేషన్ ఘనపూర్, వైరా సీట్లలో సిట్టింగులని పక్కన పెట్టారు.వాస్తవానికి 8 సీట్లని మార్చారని చెప్పాలి. ఎందుకంటే కే‌సి‌ఆర్ గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో పోటీ చేస్తున్నారు. అక్కడ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ని పక్కన పెట్టి కే‌సి‌ఆర్ పోటీ చేస్తున్నారు. ఇక ఏడుగురు సిట్టింగులని ఎందుకు మార్చారనేది ఒక్కసారి చూస్తే..మొదట వేములవాడలో ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ ఉన్నారు..ఆయన విదేశీ పౌరసత్వంపై కేసు ఉంది..దీంతో ఆయన్ని పక్కన పెట్టి చల్మెడ లక్ష్మీ నరసింహారావుకు సీటు ఇచ్చారు.

ఆసిఫాబాద్ లో ఆత్రం సక్కుని పక్కన పెట్టి..కోవా లక్ష్మీకి ఛాన్స్ ఇచ్చారు. ఆత్రంపై వ్యతిరేకత వల్ల పక్కన పెట్టారు. బోథ్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ప్లేస్ లో అనిల్ జాదవ్‌ని అభ్యర్ధిగా పెట్టారు. ఖానాపూర్ లో రేఖా నాయక్‌ని తప్పించి…జాన్సన్ నాయక్‌ని పెట్టారు.

స్టేషన్ ఘనపూర్ లో తాటికొండ రాజయ్యని సైడ్ చేసి..కడియం శ్రీహరిని, ఉప్పల్ లో భేతి సుభాష్ రెడ్డి ప్లేస్ లో లక్ష్మారెడ్డి, వైరాలో రాములుని తప్పించి, మదన్ లాల్‌ని అభ్యర్ధిగా పెట్టారు. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో సాయన్న చనిపోగా, ఆయన కుమార్తె లాస్యకు సీటు ఇచ్చారు. అటు కోరుట్లలో ఎమ్మెల్యే విద్యాసాగర్..తన తనయుడు సంజయ్‌కు సీటు ఇప్పించుకున్నారు. ఇలా ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేల సీట్లలో మార్పులు జరిగాయి. కొందరిపై వ్యతిరేకత ఉండటం వల్ల పక్కన పెట్టారు. అటు జనగామ, నర్సాపూర్, నాంపల్లి, గోషామహల్ సీట్లు పెండింగ్ లో పెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news