నేటితో ముగియనున్న బండి సంజయ్​ పాదయాత్ర

-

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఇవాళ్టితో ముగియనుంది. మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పది రోజుల పాటు ఈ యాత్ర జరిగింది. కుత్బుల్లాపూర్, కూకట్​పల్లి, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మల్కాజిగిరి, మేడ్చల్, ఉప్పల్, ఎల్బీనగర్‌తో పాటు ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో సాగిన ఈ యాత్ర నేటితో ముగింపునకు చేరుకుంది.

నాలుగో విడత యాత్రలో బండి సంజయ్ ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తూనే అధికార టీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. ప్రజల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని వారికి హామీ ఇవ్వడంతోపాటు రాష్ట్ర సర్కార్ మెడలు వంచి సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు. పది రోజుల పాటు సాగిన నాలుగో విడత ప్రజాసంగ్రామ యాత్ర ఇవాళ సాయంత్రం హైదరాబాద్ అంబర్ పేటలో ముగుస్తుంది. అక్కడే భారీ బహిరంగ సభలో తన ప్రసంగంతో బండి సంజయ్ నాలుగో విడత ప్రజాసంగ్రామ యాత్రకు ముగింపు పలుకుతారు.

Read more RELATED
Recommended to you

Latest news