నేనూ ఓనర్‌నే.. నాయిని ఫైర్‌… మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని మాట త‌ప్పాడు

-

టీఆర్ఎస్‌లో అసంతృప్త జ్వాల‌లు ఒక్కొక్క‌టిగా ఎగ‌సి ప‌డుతున్నాయి. సీఎం కేసీఆర్‌పై ఉన్న అసంతృప్తిని ఒక్కొక్క‌రుగా బ‌య‌ట పెట్టుకుంటున్నారు. కొద్ది రోజుల క్రిత‌మే మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ తాను కూడా గులాబీ జెండా ఓన‌రేనే అని చెపితే.. ఆ వెంట‌నే మాన‌కొండూరు ఎమ్మెల్యే ర‌స‌మ‌యి బాల‌కిష‌న్ సైతం తెలంగాణ బోర్డు మారిందే త‌ప్పా కొత్తగా మారిందేం లేద‌ని త‌న మ‌న‌స్సులో ఆవేద‌న వెళ్ల‌క‌క్కారు. ఇక ఇప్పుడు మాజీ హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి సీఎం కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ తనకు ఇచ్చిన మాట తప్పారని ఆయన మండిపడ్డారు.

తెలంగాణ ఏర్ప‌డ్డాక ఏర్ప‌డిన తొలి ప్ర‌భుత్వంలో నాయిని నర్సింహరెడ్డి హోం మంత్రిగా కొనసాగారు. ఈ దఫా నాయిని నర్సింహరెడ్డికి కేసీఆర్ ఎలాంటి పదవి ఇవ్వలేదు. దీంతో నాయిని నర్సింహరెడ్డి కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. సోమ‌వారం ఆయ‌న మీడియా స‌మావేశంలో కేసీఆర్ టార్గెట్‌గా అనేక హాట్ హాట్ కామెంట్స్ చేశారు. తనకు ఇచ్చిన మాటను సీఎం కేసీఆర్ తప్పారని నాయిని నర్సింహరెడ్డి చెప్పారు. తనకు ఏ కార్పోరేషన్ పదవి వద్దని నాయిని నర్సింహరెడ్డి తేల్చి చెప్పారు.

హోం మంత్రి పదవి నిర్వహించిన తన‌కు కార్పొరేష‌న్ చైర్మ‌న్ ప‌ద‌వి స‌రైందేనా ? అని ప్ర‌శ్నించారు. త‌న‌కు ఆర్టీసీ చైర్మ‌న్ ప‌ద‌వి అవ‌స‌రం లేద‌ని… అందులో ర‌సం లేద‌ని అన్నారు. ఇక ఎన్నిక‌ల‌కు ముందు త‌న‌కు ముషీరాబాద్ సీటు ఇమ్మ‌ని అడిగితే… ముఠాగోపాల్‌ను గెలిపించుకుని రా మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌న్నార‌ని… ఆ టైంలో త‌న అల్లుడికి అయినా ఎమ్మెల్యే సీటు ఇవ్వాల‌ని అడిగితే అల్లుడికి కూడా ఎమ్మెల్సీ ఇస్తాన‌ని ఆశ పెట్టార‌ని నాయిని అసంతృప్తి వ్య‌క్తం చేశారు.

టీఆర్ఎస్‌కు తాను కూడ ఓనర్‌నేనని చెప్పిన ఆయ‌న కిరాయికి వచ్చిన వాళ్లు ఎప్పుడు దిగిపోతారో తెలియదన్నారు ఇక గ‌త డిసెంబ‌ర్లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో నాయిని త‌న‌కు లేదా త‌న అల్లుడికి ముషీరాబాద్ సీటు ఇవ్వాల‌ని అడిగారు. ముషీరాబాద్ అసెంబ్లీ సీటును టీడీపీ నుండి టీఆర్ఎస్‌లో చేరిన ముఠా గోపాల్ కు ఇచ్చారు. ఈ సమయంలో తనకు ఇచ్చిన హమీని నెరవేర్చలేదని కేసీఆర్ పై నాయిని నర్సింహ రెడ్డి మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news