టీడీపీ vs వైసీపీ….వ‌ర‌ద‌ల‌పై ట్విట్ట‌ర్ వార్‌

-

ఏపీలో వ‌ర‌ద‌ల రాజ‌కీయం హాట్ హాట్‌గా సాగుతోంది.ఇటీవ‌ల భారీ వరదలతో విజయవాడ నగరం అతలాకుతలమైన విష‌యం తెలిసిందే. గతంలో ఎన్నడూ లేనంత‌గా భారీ వ‌ర‌ద విజ‌య‌వాడ న‌గ‌రాన్ని ముంచెత్తింది.దీంతో న‌గ‌ర‌వాసులు తీవ్ర ఇబ్బందుల‌ను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా శివారు ప్రాంతాల వారు వ‌ర‌ద‌ల్లో మునిగిపోయి నివాసాల నుంచి సుర‌క్షిత ప్రాంతాల‌కు వెల్ళిపోయారు.కొంద‌రైతే వ‌ర‌ద‌ల్లో చిక్కుకుని ఎటూ వెళ్ళ‌లేక బిక్కుబిక్కుమంటూ ప్రాణాల‌ను గుప్పిట్లో పెట్టుకుని బ్ర‌తికారు.

ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సాయంపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యంతోనే విజయవాడలో వరదలు వచ్చాయని ట్విట్టర్ వేదికగా సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. వరదలు వచ్చి 8 రోజులు అవుతున్నా.. ఇంకా ప్రజలు నీటిలోనే సాయం అందని పరిస్థితుల్లో ఉండడం దారుణమన్నారు. జగన్ ట్వీట్‌కు టీడీపీ కూడా ఘాటుగా రిప్లై ఇచ్చింది. తమరు ఈ ట్వీట్ బెంగుళూరులో ఉండి వేశారా..? లండన్‌లో ఉండి చేశారా..? అంటూ కౌంటర్ ఇచ్చింది. అదంతా స‌రే వరద బాధిత ప్రజలకు త‌మ‌రు ప్ర‌క‌టించిన కోటి రూపాయ‌ల ఆర్థిక సాయం ఎప్పుడు ఇస్తున్నారని ప్రశ్నించింది.దీంతో వ‌ర‌ద రాజ‌కీయం బెజ‌వాడ‌లో వేడెక్కింది.

ఇంత‌కీ జ‌గ‌న్ ఏమ‌న్నారంటే…వరదలు వచ్చి 8 రోజులు అవుతున్నా బాధితులకు ఇంకా దారీ తెన్నూ లేకుండా పోయిందని,విజయవాడలో ఇంకా ఆకలి కేకలు వినిపిస్తున్నాయని..రాష్ర్టంలో అస‌లు ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. వరదల కంటే చంద్రబాబు అసమర్థత వల్ల భారీ నష్టం వచ్చిందన్నారు. గతంలో 50 మందికిపైగా చనిపోవడం ఎప్పుడూ జరగలేదని.. వర్షాలు నిలిచి నాలుగైదు రోజులు అవుతున్నా ప్రజలు ఇంకా నీటిలోనే సాయం అందని పరిస్థితుల్లో ఉండడం దారుణమన్నారు. ఆగస్టు 30 నుంచి భారీ వర్షాలు వస్తాయని, భారీగా వరద వస్తుందని ముందే అలర్ట్ వచ్చినా.. పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు.

చంద్రబాబు ప్రచార ఆర్బాటాలతో సహాయక చర్యల్లో పూర్తిగా సమన్వయం లోపం నెలకొందని, లక్షల ఉద్యోగులు ఉన్న ప్రభుత్వ యంత్రాంగం ఏమైపోయింది..? అని ప్రశ్నించారు. బాధితులకు బియ్యం, పప్పు, నూనె తదితర సరుకులు ఇవ్వ‌డం ఇదే తొలిసారి అని అన్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నారని.. తమ ప్రభుత్వంలో వరద బాధితులకే కాకుండా.. వరద ప్రభావం ఉన్న కుటుంబాలకు కూడా రేషన్‌ సరుకులను ఒక్కరోజులో డోర్ డెలివరీ చేశామని గుర్తు చేశారు. బాధితులు కోలుకునేలా ఉదారంగా సాయం అందించాలని.. ప్రభుత్వం ఆదుకోకపోతే పార్టీ తరఫున కచ్చితంగా పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు.

ఇక వైసీపీ ఇచ్చిన ట్వీట్‌కి టీడీపీ సైతం కౌంట‌ర్ ట్వీట్ ఇచ్చింది. సీఎం చంద్రబాబు సమర్ధతతో ఒక్క రోజులో మూడు పూటలా కలిపి 8 లక్షల మందికి ఆహారం అందించామని టీడీపీ చెప్పింది.మంచి నీళ్ళు, పాలు వీటికి అదనంగా ఉన్నాయ‌న్నారు. ఇప్పటికే 66,454 కుటుంబాలకి నిత్యావసర వస్తువుల కిట్ పంపించామని స్పష్ట చేసింది. “మూడు రోజుల్లో కాదు, రెండు గంటల్లో 40 సెం.మీ వర్షం పడింది.

ఫ్లాష్ ఫ్లడ్ వచ్చింది. ప్రజలు చక్కగా సహాయక శిబిరాల్లో ఉన్నారు. అన్ని సౌకర్యాలు వారికి అందుతున్నాయి. బెంగుళూరులో ఉండే నీకు ఇలాంటివి తెలిసే అవకాశం లేదు. నీ ఐదేళ్ళ చేతికాని పాల‌న వ‌ల‌నే ఇదంతా జ‌రిగింద‌ని ఎదురు ప్ర‌శ్నించారు. ఏడాది క్రితం బుడమేరుకి గండి పడితే నిద్ర పోయావ్. బుడమేరు గట్టు పై మట్టి అమ్ముకుని సొమ్ము చేసుకున్నావ్. బుడమేరు ఆక్రమించి, ఫ్లాట్లు చేసుకుని అమ్ముకున్నావ్. టీడీపీ ప్రభుత్వం చేపట్టిన బుడమేరు ఆధునీకరణ పనులు ఆపేసి రూ.500 కోట్లు వెనకేసుకున్నావ్ అని తీవ్ర విమ‌ర్శ‌లు చేసింది టీడీపీ.

శుక్రవారం రాత్రి వర్షం పడితే, శనివారం ఉదయానికి అధికారులు ఫీల్డ్ లో ఉన్నారు. NDRF, ఆర్మీ లాంటి వాళ్ళే ఆ వరదలో వెళ్ళలేని ప్రతికూల పరిస్థితి ఉంటే, వాలంటీర్లు ఎలా వెళ్తారు..? బురద చల్లటం ఆపి, వాస్తవిక ప్రపంచంలో బ్రతుకు జ‌గ‌న్ అని స్ర్టాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. నీ లాగా ఒక టమాటా, ఒక బంగాళదుంప ఇచ్చి చేతులు దులుపుకునే ప్రభుత్వం కాదు మాది. నీ ఘనకార్యాలు గత 5 ఏళ్ళు చూసాం కదా..” అని ఘాటుగా జగన్ ట్వీట్‌కు రిప్లై ఇచ్చింది.దీంతో విజ‌య‌వాడ వేదిక‌గా టీడీపీ,వైసీపీ మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version