బీజేపీ ఎంపీతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే భేటీ… పార్టీ మార్పు సంకేతాలు..

-

తెలంగాణలో రాజకీయాలు క్షణక్షణానికి మారుతున్నాయి. ఈరోజు ఉన్న పొలిటికల్ వాతావరణం రేపటికి మారిపోతోంది. ఏ పార్టీకి చెందిన నేత ఎప్పుడు ఎవరిని ? కలుస్తారో… ఈరోజు ఒక పార్టీలో ఉన్న నేత రేపు ఏ పార్టీలో ఉంటారో కూడా ఎవరికీ అంతుపట్టడం లేదు. తెలంగాణలో ఎట్టిపరిస్థితుల్లోనూ పట్టు సాధించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్న బిజెపి వేస్తున్న ఎత్తులకు అధికార టీఆర్ఎస్ కు ముచ్చెమటలు పడుతున్నాయి. ఇక తాజాగా టిఆర్ఎస్ నేతలు కొద్ది రోజులుగా ఎదురు చూస్తూ మంత్రివర్గ విస్తరణ ముచ్చ‌ట‌ కూడా తీర‌డంతో ఆ పార్టీలో ఉన్న అసంతృప్తి నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై రకరకాల చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే.


మరోవైపు టీఆర్ఎస్ నేతలు సైతం తమ గళం వినిపిస్తున్నారు. ఈట‌ల‌ రాజేందర్ – రసమయి బాలకిషన్ – నాయిని నర్సింహారెడ్డి – తాటికొండ రాజయ్య లాంటి నేతలు చేసిన వ్యాఖ్యలపై కెటిఆర్ కౌంటర్ ఇవ్వడంతో పాటు… ఎవరైనా క్రమశిక్షణ తప్పితే సహించని కూడా వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉంటే గురువారం తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం చోటు చేసుకుంది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన బోధ‌న్‌ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ అదే జిల్లాకు చెందిన బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ను కలిసి చర్చలు జరపటం తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది.

ఈ క్రమంలోనే ష‌కీల్ అహ్మ‌ద్ టిఆర్ఎస్ గుడ్ బై చెప్పేసి బిజెపిలోకి వెళ్లి పోతారు అన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే అర్వింద్ కూడా ష‌కీల్‌తో టీఆర్ఎస్‌లో ఇంకా ఎవ‌రెవ‌రు అసంతృప్త నేత‌లు ఉన్నార‌న్న అంశంపై కూడా చ‌ర్చ‌లు జ‌రిపార‌ని తెలుస్తోంది. ఇక అటు బీజేపీ కూడా టీఆర్ఎస్‌లో ఉన్న అసంతృప్త నేత‌ల‌పై వ‌లేసి పార్టీలో చేర్చుకునే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తోంది. 10 మంది ఎమ్మెల్యేల‌తో పాటు ఒక‌రిద్ద‌రు మంత్రులు కూడా త‌మ‌తో ట‌చ్‌లో ఉన్నార‌ని కాషాయ ద‌ళం క‌ల‌క‌లం రేపుతోంది. ఈ టైంలో ష‌కీల్ – అర్వింద్ చ‌ర్చ‌లు రాజ‌కీయంగా ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news