అఖిలప్రియ కుటుంబానికి గుంటూరు శ్రీనుకు ఉన్న లింకేంటి ?

-

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన బోయిన్‌పల్లి కిడ్నాప్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో టీడీపీ మహిళా నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్టై జైలుకెళ్లారు. పరారీలో ఉన్న ఆమె భర్త భార్గవ్ రామ్ కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ కేసులో అనూహ్యంగా మరోపేరు తెరమీదకు వచ్చింది. గుంటూరుకు చెందిన మాదల శ్రీను..అలియాస్ శ్రీనివాస్ చౌదరి. కిడ్నాప్‌ ముఠాకి నాయకత్వం వ్యవహరించిన శ్రీనుకి భూమా కుటుంబానికి ఉన్న లింక్ ఏంటి అన్న దాని పై ఇప్పుడు చర్చ నడుస్తుంది.

కిడ్నాప్ ఎలా చేయాలి.. ఎలా వెళ్లాలి అనే విషయాలపై శ్రీను సినీ ఫక్కీలో స్కెచ్ గీయగా.. అతని ముఠా సభ్యులు కిడ్నాప్ చేశారన్న ప్రచారం జరుగుతోంది. అందుకోసం శ్రీనగర్ కాలనీలో ఐటీ అధికారుల్లా కనిపించేందుకు డ్రెస్‌లు కూడా అద్దెకు తీసుకున్నట్లు తెలిసింది. గుంటూరుకు చెందిన శ్రీను.. భూమా అఖిల ప్రియ భర్త భార్గవ రామ్‌కు రైట్‌హ్యాండ్‌గా చెబుతున్నారు. శ్రీను అన్నీ తానై భార్గవ్‌ రామ్‌ ని నడిపిస్తున్నట్లు సమాచారం.

అఖిల ప్రియ కుటుంబానికి నమ్మదగ్గ.. కీలక అనుచరుడిగా శ్రీను వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీను లైఫ్‌స్టైల్ కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సరదాల కోసం హెలికాప్టర్లలో వెళ్లేంత విలాసవంతమైన జీవితం గడుపుతుంటాడని సమాచారం. నంద్యాల ఉపఎన్నికలోనూ గుంటూరు శ్రీనే కీలకంగా వ్యవహరించినట్లు పోలీస్ చెప్తున్నారు. మాదల శ్రీను పేరుతో పాటు..మాజీ మంత్రి అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్‌తో సన్నిహితంగా ఉన్న ఫొటోలు బయటకు రావడంతో వైరల్‌‌గా మారాయి. భూమా కుటుంబంతో.. శ్రీను నమ్మకంగా ఉండేవాడని అంటున్నారు.

గుంటూరులో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ ర్యాలీల్లో పాల్గొన్న ఫొటోలు కూడా లీకవడంతో స్థానికంగా టీడీపీలో చురుకుగా ఉండేవాడని భావిస్తున్నారు. మాదల శ్రీను గత నేరచరిత్రపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ముఠా నాయకుడి కోసం..ఇప్పటికే ఏపీలోని గుంటూరు సహా నాలుగు రాష్ట్రాల్లో గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం. పరిటాల రవి హత్య కేసులో ముద్దాయిగా ఉన్న మొద్దు శ్రీనుది గుంటూరు జిల్లానే కావడం యాదృచ్ఛికం.

గుంటూరు శీను తన అనుచరులతో కలిసి ప్రవీణ్ కుమార్ కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసినట్టుగా చెబుతున్నారు. శ్రీనుకు సంబంధించిన పూర్తి వివరాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news