ప్రపంచ వేదికపై ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న రాజమౌళి

-

ప్రపంచ వేదికపై భారతీయ సినిమా ఘనతను మరోసారి చాటారు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. వరల్డ్ సినిమా రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డును ఆయన అందుకున్నారు. న్యూయార్క్ వేదికగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో కుటుంబసమేతంగా జక్కన్న పాల్గొని.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) చిత్రానికిగానూ ఉత్తమ దర్శకుడిగా ఈ అవార్డును అందుకున్నారు.

‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికిగానూ ఉత్తమ దర్శకుడిగా ప్రతిష్ఠాత్మక అవార్డును సొంతం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ వేదికపై అందరి ముందు నిల్చొని మాట్లాడటం కాస్త కంగారుగా అనిపిస్తోంది. నా దృష్టిలో సినిమా అంటే ఓ దేవాలయం. చిన్నప్పుడు థియేటర్‌లో సినిమా చూడటానికి వెళ్లినప్పుడు పొందిన ఆనందం ఇప్పటికీ గుర్తుంది. నేను ఏ సినిమా తీసినా ప్రతి సీన్‌ను చిత్రీకరించే ముందు.. ‘ఈ సీన్‌ థియేటర్‌లో ఎలా ఉంటుంది’ అని ఒక ప్రేక్షకుడిగా ఊహించుకుంటా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులను ఆకట్టుకోవడం కోసం నేను సినిమాలు చేస్తుంటాను. కానీ, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు వచ్చేసరికి భారతీయులు ఎలాంటి ప్రేమను చూపించారో.. అదే అభిమానాన్ని, ఉత్సాహాన్ని విదేశాల్లోనూ చూశా. నా సినిమాల కోసం పనిచేసే ముఖ్యమైన వ్యక్తులందరూ నా సొంత కుటుంబసభ్యులే. నేను తెరకెక్కించే సినిమాలకు నా తండ్రి (విజయేంద్రప్రసాద్‌) కథ రాస్తుంటారు. పెద్ద అన్నయ్య (కీరవాణి) సంగీత దర్శకుడిగా, నా సతీమణి (రమ) కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా‌, నా తనయుడు (కార్తికేయ), వదిన (వల్లి) లైన్‌ ప్రొడ్యూసర్లుగా, సోదరుడి కుమారుడు (కాలభైరవ) గాయకుడిగా, మరో సోదరుడు రచయితగా.. ఇలా వీళ్లంతా నన్ను ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉన్నారు. నన్ను అత్యున్నత స్థానంలో నిలపడం కోసం వారు కష్టపడుతున్నారు. నేను ఎలాంటి విజయాలు అందుకున్నా నా కుటుంబానికి ఎప్పటికీ రుణపడి ఉంటా.’ అని జక్కన్న చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news