ఓబుళాపురం మైనింగ్ కార్పొరేషన్ (ఓఎంసీ) అక్రమాల కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై. శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో కీలక పరిణామం ఎదురైంది. గతంలో ఆమెను ఈ కేసు నుంచి విడుదల చేస్తూ (డిశ్చార్జ్ చేస్తూ) హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసింది. హైకోర్టు తీర్పును పూర్తిగా పక్కన పెట్టిన సుప్రీంకోర్టు, కేసులో ఆమె పాత్రపై మళ్లీ విచారణ జరిపించాలని స్పష్టం చేసింది. ఈ కేసులో మూడు నెలల్లోగా విచారణను పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. అంతేగాక, హైకోర్టు తీర్పు ప్రభావం లేకుండా, స్వతంత్రంగా విచారణ కొనసాగించాలన్నది సుప్రీంకోర్టు స్పష్టం. తెలంగాణ హైకోర్టు 2022లో శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్ను అనుమతించి ఆమెకు ఊరట కల్పించిన విషయం తెలిసిందే. అయితే, తాజా సుప్రీంకోర్టు నిర్ణయంతో ఆమెకు మళ్లీ చట్టపరంగా సమస్యలు తలెత్తనున్నాయి.
ఇక ఇదే కేసులో ప్రధాన నిందితులైన గాలి జనార్దనరెడ్డి, బి.వి.శ్రీనివాసరెడ్డి, వి.డి.రాజగోపాల్, మెఫజ్ అలీఖాన్లకు ఇటీవల హైదరాబాద్లోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. అదనంగా వీరికి రూ.20,000 చొప్పున జరిమానా విధించగా, వి.డి.రాజగోపాల్కు మరిన్ని ఆరోపణలపై మరో నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు రూ.2,000 జరిమానా విధించింది. నిందితులు జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది. ఓబుళాపురం మైనింగ్ కార్పొరేషన్కు రూ.2 లక్షల జరిమానా విధించారు. ఈ నేపథ్యంలో శ్రీలక్ష్మిపై సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు ఈ కేసులో మరింత కీలకంగా మారాయి.