మత మార్పిడి చట్టాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ

-

కులాంతర వివాహాలు, వివాహ అనంతరం బలవంతంగా మత మార్పిడిని నిరోధించేందుకు ఉత్తరప్రదేశ్‌, ఉత్తరఖండ్‌ ప్రభుత్వాలు తీసుకొచ్చిన వివాదాస్పద చట్టాలపై స్టే ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. దీనిపై ఈ రెండు రాష్ట్రాలకు నోటీసులు కూడా జారీ చేసింది. అయితే ఈ వివాదాస్పద చట్టాల చెల్లుబాటును పరీక్షించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. రెండు రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకుని వివాహ అనంతరం మత మార్పిడి చట్టాలపై పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది.

court
court

ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాలు తీసుకొచ్చిన మతమార్పిడి నిరోధక చట్టాల రాజ్యాంగబద్ధత కల్పించడంపై సవాల్‌ చేస్తూ ‘‘సిటిజన్‌ ఫర్‌ జస్టిస్‌ అండ్‌ పీస్‌’’ అనే ఎన్జీఓ, న్యాయవాది విశాల్‌ఠాక్రే సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ చట్టాల్లో కొన్ని నిబంధనలు దౌర్జన్యంగా, బలవంతంగా ఒప్పించేలా ఉన్నాయని, ప్రభుత్వ అనుమతితోనే పెళ్లి చేసుకోవాలనడం విచారకరమని వాళ్లు పేర్కొన్నారు. ఈ నిబంధనలు సమానత్వ హక్కులు, లౌకికవాదంను ఉల్లంఘిస్తున్నాయని వారు ఆరోపించారు. దీనిపై అత్యున్నత న్యాయస్థానం సమీక్షించాల్సిన అవసరం ఉందని, అప్పటివరకు ఈ చట్టాలను స్టే విధించాలని విశాల్‌ఠాక్రే పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ రెండు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. వీటిపై నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. చట్టాలపై ప్రభుత్వాల వాదన వినకుండా స్టే ఇవ్వడం కుదరదని, రెండు ప్రభుత్వాల వాదనలు విన్నాక తుది నిర్ణయం తీసుకుంటామని సీజేఐ జస్టిస్‌ బోబ్డే తెలిపారు. వివాహం కోసం మతమార్పిడిని నేరంగా పరిగణిస్తూ యూపీ, ఉత్తరాఖండ్‌ ప్రభుత్వాలు కొత్త చట్టాలను తీసుకొచ్చాయి. పెళ్లి తర్వాత మతం మారాలని అనుకుంటే 2నెలల ముందుగానే జిల్లా అధికారులకు సమాచారం అందజేయాలని పేర్కొన్నారు. అంతే కాకుండా ఎవరీ బలవంతం లేకుండా మతం మారుతున్నట్లు రుజువు చేయాలని ప్రభుత్వాలు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ చట్టాల కింద ఆయా రాష్ట్రాలు పలువురిని అరెస్టు చేశారు. కాగా, ఈ చట్టాలను హిమాచల్‌ ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లోనూ తీసుకొచ్చాయని ఆయా ప్రభుత్వాలు పేర్కొన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news