తెలంగాణ రైతులకు బిగ్ షాక్..వడ్లకు మద్దతు ధర మీద రూ. 600 కట్ చేస్తున్నారు. 500 రూపాయల బోనస్ దేవుడు ఎరుగు మద్దతు ధరలో రూ.600 కోత పెట్టి రూ.1600కే కొంటున్నారు దళారులు. జనగాంలో ఈ సంఘటన జరిగింది. అసలే కరువు కాలం ఉందంటే రైతులు కష్టకాలంలో పండించి తెచ్చిన పంటను వ్యాపారులు సిండికేట్ అయి తేమ శాతం పేరు చెప్పి మద్దతు ధర మీద 500 రూపాయల నుండి 600 వరకు తగ్గించి కొంటాం అనడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం సరైనన్ని కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్న రైతులు.. 7,149 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా ఇప్పటివరకు 443 మాత్రమే ప్రారంభం అయ్యాయి.జనగాం మార్కెట్కు వడ్లు తెచ్చిన రైతులు ఉదయం నుండి సాయంత్రం వరకు వేచి చూడగా తేమ శాతం పేరిట 1600 రూపాయలకు మాత్రమే కొంటాం అనడంతో వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది.రైతుల ఆందోళన గురించి తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత రెడ్డి అక్కడికి చేరుకుని మద్దతు ధర కంటే తక్కువకు ఎవరు కొన్నా ఊరుకునేది లేదని హెచ్చరించారు.