బీఆర్ఎస్ ముమ్మాటికీ టీ టీమ్‌: కేటీఆర్‌

-

బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్​కు సీ టీమ్ అంటూ హైదరాబాద్​ బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు ఖండిస్తున్నారు. మోదీ వ్యాఖ్యలపై తాజాగా మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత స్పందించారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల టీమ్‌ అని.. కాంగ్రెస్‌, బీజేపీకి కాదని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

ఈ మేరకు ట్వీట్‌ చేసిన కేటీఆర్… రాహుల్‌ గాంధీ వచ్చి బీఆర్ఎస్ బీజేపీకి బీ-టీమ్ అంటారని.. ప్రధాని మోదీ వచ్చి….కాంగ్రెస్‌కు సీ-టీమ్ అంటారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ బీజేపీకి బీ-టీమ్‌కాదని, కాంగ్రెస్‌కు సీ-టీమ్‌ కాదని ముమ్మాటికి టీ (తెలంగాణ) టీమ్‌ అని పేర్కొన్నారు. ప్రజల హక్కుల కోసం ఎవరితోనైనా ఎక్కడి దాకైనా పోరాడే ఏకైక టీమ్ బీఆర్ఎస్ పార్టీ అని మంత్రి కేటీఆర్ తెలిపారు. నిన్నటి వరకు మత రాజకీయం చేశారు, నేడు కులరాజకీయానికి తెర తీశారని ప్రధాని నరేంద్ర మోదీపై ధ్వజమెత్తారు.

మరోవైపు రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బీసీని తొలగించి.. ఓసీకి కట్టబెట్టిన బీజేపీ బీసీ నినాదం ఎత్తుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు.  కేవలం ఎన్నికల కోసమే….. బీజేపీ బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించిందని ధ్వజమెత్తారు.

Read more RELATED
Recommended to you

Latest news