భారత్ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 27వ తేదీన వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సభను పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించేందుకు పార్టీ పటిష్ఠ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఏర్పాట్లు మొదలయ్యాయి. అయితే ఈ సభకు భారీ ఎత్తున కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని ఇప్పటికే పార్టీ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
ఇక పార్టీ అధిష్ఠానం మేరకు కీలక నేతలు కూడా ఈ సభ గురించి అవగాహన కల్పిస్తూ పెద్ద ఎత్తున తరలిరావాలని ప్రజలకు, కార్యకర్తలను కోరుతున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహా సభకు ప్రజలు వేలాదిగా హాజరయ్యేలా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పార్టీ కార్యకర్తలు వినూత్న కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రామవరంలో కాపు సీతాలక్ష్మీ దంపతులు ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి సభకు ఆహ్వానం పలుకుతున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తున్నారు.