వారి అవసరాల కోసమే క్యాబినెట్ భేటీ : మాజీ మంత్రి పొన్నాల

-

కాంగ్రెస్ నేతలు వారి అవసరాల కోసమే కేబినెట్ భేటీ పెట్టుకున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి పొన్నాల విమర్శించారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో ఆరు గ్యారెంటీల అమలు ఏమైందని ప్రశ్నించారు. సన్న బియ్యం పంటకు మాత్రమే బోనస్ 500 రూపాయలు ఇస్తామని ప్రభుత్వం చెప్పిందని.. ఎన్నికల ముందు వరి పంటకు 500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ రైతులకు చెప్పిందని గుర్తు చేశారు. ఎన్నికల కోడ్ వుండగానే సీఎం రేవంత్ రెడ్డి బోనస్ ఇస్తామని చెప్పారని తెలిపారు. ఓట్లు దండుకోవడం కోసమే సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసం చేశారని ఫైర్ అయ్యారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అన్నారు. తడిసిన ధాన్యం వద్దకు ఇప్పటి వరకు కాంగ్రెస్ మంత్రులు వెళ్ళలేదని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారానికి ఇతర రాష్ట్రాలకు మంత్రులు వెళ్తున్నారని.. తడిసిన వడ్లను ఇప్పటి వరకు ఒక్క కేజీ ప్రభుత్వం కొనుగోలు చేయలేదని మండిపడ్డారు. అధికారంలోకి వస్తే రైతు బంధు రూ.15 వేలు ఇస్తామని చెప్పారని గుర్తు చేశారు. రైతు కూలీలకు రూ.12 వేలు ఇస్తామన్న అంశంపై కేబినెట్ మీటింగ్లో చర్చ జరిగిందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల గొంతు కోసిందన్నారు. కాంగ్రెస్ మంత్రులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతున్నారని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులతో పతనం తప్పదని వార్నింగ్ ఇచ్చారు. రైతుబంధు ఎప్పుడు ఇవ్వాలో ప్రభుత్వానికి తెలియడం లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news