వీఆర్ఏల సర్దుబాటుపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. వారి విద్యార్హతలను, సామర్థ్యాలను అనుసరించి నీటిపారుదల, ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాలని నిర్ణయించారు. తమ నాలుగేళ్ల శిక్షణ కాలాన్ని పూర్తి చేసుకున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శు(జేపీఎస్)ల ఉద్యోగాలను, నిబంధనల మేరకు క్రమబద్ధీకరించాలనీ ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
వీఆర్ఏల సర్దుబాటుకు రాష్ట్ర పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ అధ్యక్షతన మంత్రులు జి.జగదీశ్రెడ్డి, సత్యవతి రాఠోడ్లతో కూడిన మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని కేసీఆర్ ఆదేశించారు. ఈ కమిటీ వీఆర్ఏలతో సమావేశమై, వారి అభిప్రాయాలను బుధవారం నుంచే సేకరించాలని స్పష్టం చేశారు. చర్చల అనంతరం ఉపసంఘం తగిన సూచనలతో తుది నివేదికను సమర్పించాలన్నారు. నివేదిక అందాక మరోసారి చర్చిద్దామని, ఈ మొత్తం ప్రక్రియ వారం రోజుల్లోపు పూర్తి కావాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా తమ శిక్షణ కాలాన్ని పూర్తి చేసుకున్న కార్యదర్శులను జిల్లాస్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీ పరిశీలిస్తుందని, నిర్దేశిత లక్ష్యాలను మూడింట రెండొంతులు చేరుకున్న వారిని క్రమబద్ధీకరిస్తామని సీఎం తెలిపారు