రైతులకు ప్రభుత్వం మరోసారి గుడ్ న్యూస్ తెలిపింది. పీఎం కిసాన్ నిధుల విడుదలపై కీలక ప్రకటన చేసింది. అర్హులైన ప్రతి రైతుకు రూ. 2 వేల చొప్పున ఈ నెల 24న విడుదల చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అదే రోజు ఈ నిధులను బిహార్ రాష్ట్రం భాగల్పూర్లో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోడీ విడుదల చేయనున్నారు. ఎవరైనా ఈ కేవైసీ చేయాల్సిన వాళ్లు ఉంటే వెంటనే చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ కేవైసీ పూర్తి చేసిన వారికి మాత్రమే రైతుల ఖాతాల్లోకి నగదు
చేరుతుందని తెలిపారు.
2018 నుంచి పీఎం కిసాన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ప్రతి సంవత్సరం విడతల వారీగా రైతులకు పెట్టుబడి సాయం కింద రూ. 6 వేలు అందిస్తోంది. ఇప్పటి వరకూ 18 విడతల ద్వారా రైతుల ఖాతాల్లోకి రూ.2000 జమ చేశారు. 19వ విడతలో దేశవ్యాప్తంగా 9.7 కోట్ల మంది అర్హులైన రైతులు ఉన్నారు. వీరందరికి ఈ నెల 24న నగదును విడుదల చేయనున్నారు.ఏపీ వ్యాప్తంగా 42.04 లక్షల మంది అర్హులను గుర్తించారు. వీరి ఖాతాల్లోకి రూ.840.95 కోట్లు వచ్చి చేరనున్నాయి. అనంతపురం జిల్లాలో 2.85 లక్షల మందికి, విశాఖలో అత్యల్పంగా 17 వేల మంది రైతులకు పీఎం కిసాన్ నిధులు అందనున్నాయి.