చంద్రబాబుకు మద్దతుగా ‘లెట్స్‌ మెట్రో ఫర్‌ సీబీఎన్‌’.. భారీగా తరలివచ్చిన అభిమానులు

-

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు గత నెలరోజుల నుంచి ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు అభిమానులు, పార్టీ కార్యకర్తలు హైదరాబాద్‌లో వినూత్న కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ‘లెట్స్‌ మెట్రో ఫర్‌ సీబీఎన్‌’ పేరుతో తలపెట్టిన కార్యక్రమం నేపథ్యంలో మెట్రో స్టేషన్ల వద్ద హైదరాబాద్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు.

మెట్రో స్టేషన్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రవేశాల వద్ద బందోబస్తు నిర్వహిస్తూ నల్ల చొక్కాలు ధరించిన వారిని లోనికి అనుమతించడం లేదు. చంద్రబాబు అభిమానులు భారీగా తరలిరావడంతో.. మియాపూర్ మెట్రో స్టేషన్‌ను కాసేపు తాత్కాలికంగా మూసివేసి.. ఆ తర్వాత ప్రయాణికులను అనుమతించారు.

మరోవైపు ఎల్బీనగర్ మెట్రోస్టేషన్‌ వద్ద నల్ల టీషర్ట్ వేసుకొని వచ్చిన యువకులను అడ్డుకోవడంతో.. పక్కనే ఉన్న డీ – మార్టులోకి వెళ్లి ఇతర రంగు టీషర్ట్‌లు కొనుగోలు చేసి వెళ్తున్నారు. శనివారం ఉదయం 10.30 – 11.30 గంటల మధ్య మియాపూర్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకూ నల్ల టీషర్టులు ధరించి మెట్రోలో ప్రయాణించాలని చంద్రబాబు అభిమానులు పిలుపునిచ్చారు. మెట్రో ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఈ శాంతియుత నిరసన చేపట్టాలని నిర్ణయించారు.

Read more RELATED
Recommended to you

Latest news