రేపు శాసనసభ ముందుకు ఆర్థిక శాఖ శ్వేతపత్రం.. రంగం సిద్ధం చేస్తున్న ప్రభుత్వం

-

రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్ ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే శాసనసభలో ఈ వివరాలను వెల్లడించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. బుధవారం రోజున శాసనసభ ముందుకు రానున్న ఆర్థికశాఖ శ్వేతపత్రంపై కసరత్తు కొనసాగుతోంది. రాష్ట్ర ఆవిర్భావం మొదలు ఇప్పటివరకు వివిధ రూపాల్లో ఖజానాకు వచ్చిన మొత్తం, చేసిన వ్యయానికి సంబంధించిన పూర్తి వివరాలతో శ్వేత పత్రం విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.

ప్రత్యేకించి అప్పుల విషయమై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించింది. 2014 జూన్ రెండు నాటికి ఉన్న మిగులు బడ్జెట్ క్రమంగా ఎలా లోటులోకి వెళ్లింది. వివిధ రకాలుగా తీసుకున్న అప్పులు ఏ మేరకు పెరిగాయన్న విషయాలను వివరించేందుకు సర్కార్ రంగం సిద్ధం చేసింది. ముఖ్యంగా ఆర్థిక, విద్యుత్‌శాఖలపై ఎక్కువగా దృష్టి సారించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు అధికారులు దీనిపై కసరత్తు చేస్తున్నారు. శ్వేతపత్రంలో ఉండాల్సిన అంశాలు, వివరాలకు సంబంధించిన వివరాలను సిద్ధం చేస్తున్నారు. రంగాల వారీగా చేసిన ఖర్చు, ప్రస్తుత ఆర్థిక పరిస్థితి సంబంధిత వివరాలను శ్వేత పత్రంలో ప్రధానంగా పేర్కొననున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news