3.22 కోట్లకు చేరిన తెలంగాణ ఓటర్లు.. నెల రోజుల్లో 4.71 లక్షల మంది నమోదు

-

తెలంగాణలో ఓటర్ల సంఖ్య ఈనెల 03వ తేదీ నాటికి 3,22,04,148కి చేరింది. సుమారు నెల రోజుల వ్యవధిలో 4,71,421 మంది ఓటర్లు పెరిగినట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ చేపట్టిన అధికారులు గత నెల నాలుగో తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటికి రాష్ట్రంలో 3,17,32,727 మంది ఓటర్లు నమోదైనట్లు వికాస్ రాజ్ వెల్లడించారు.

గత నెల 9న కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్టోబరు 31న ఓటర్ల నమోదుకు గడువు ముగిసింది. ఆలోగా ఓటు నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపుల కోసం సుమారు 10 లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయని ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. మార్పులు, చేర్పులు, సవరణ, తొలగింపుల ప్రక్రియను గత నెల పదో తేదీనే నిలుపుదల చేశామని వెల్లడించారు. కేవలం ఓటు నమోదు దరఖాస్తులను మాత్రమే పరిగణనలోకి తీసుకుని అర్హులైన వారికి ఓటుహక్కు కల్పించామని చెప్పారు. సింహభాగం దరఖాస్తులను ఇప్పటికే పరిష్కరించామని.. మిగిలిన దరఖాస్తులను ఈ నెల పదో తేదీ వరకు పరిష్కరిస్తామని వికాస్‌రాజ్‌ వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version