తెలంగాణలో రాజకీయం మరోసారి హీటెక్కింది. తెలంగాణ సచివాలయం ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. హైదరాబాద్ పేరుతో బీజేపీ నేతలు నిరసనలకు ప్లాన్ చేశారు. ఈ క్రమంలో సచివాలయం వద్దకు బీజేపీ నేతలు రావడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. జీహెచ్ఎంసీ పరిధిలోని ఆరు జిల్లా బీజేపీ నేతలు నిరసనల్లో పాల్గొన్నారు. బీజేపీ నేతలు పెద్ద సంఖ్యలోనే సచివాలయం వద్దకు చేరుకున్నారు. అయితే, బీజేపీ నేతల నిరసనల నేపథ్యంలో సచివాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
నిరసనలకు దిగిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు వాహనాల్లో వారిని అక్కడి నుంచి తరలించారు. ఇక హైదరాబాద్ లో కరెంట్ తీగలు తగిలి ఇటీవల మరణాలు, డ్రైనేజీ సమస్యలు, గుంతల రోడ్ల అంశాలపై బీజేపీ నిరసనలకు దిగింది. జీహెచ్ఎంసీ, హైడ్రా, జలమండలి విభాగాల మధ్య కో ఆర్డినేషన్ లేక ఎక్కడి సమస్యలు అక్కడే అంటూ బీజేపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. నిరసనల నేపథ్యంలో ఇప్పటికే గ్రేటర్ పరిధిలో పలువురు బీజేపీ కార్పొరేటర్లు, నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.