ఆకాశం ఏమి ఊడిపడదు.. తొందర ఎందుకు: సల్మాన్ ఖుర్షీద్

-

కాంగ్రెస్​లో​ నాయకత్వ సమస్యపై 23 మంది నాయకులు లేఖ రాసిన నేపథ్యంలో సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధినేతను మార్చాల్సిన తొందరేమీ లేదని పేర్కొన్నారు. ఆకాశం ఊడిపడుతుందనే పరిస్థితులేవీ కనిపించడం లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రస్తుతం పార్టీ చీఫ్​గా ఉన్న నేపథ్యంలో నాయకత్వ సమస్యపైనా సోనియా గాంధీనే తుది నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. లేఖలో సంతకం పెట్టేందుకు ఎవరూ తనను సంప్రదించలేదని.. ఒకవేళ సంప్రదించినా సంతకం పెట్టేవాడిని కాదని తేల్చిచెప్పారు ఖుర్షీద్. లేఖ రాసిన బృందంలో కీలకంగా వ్యవహరిస్తున్న గులామ్ నబీ ఆజాద్​పై పరోక్షంగా అసహనం వ్యక్తం చేశారు.

లేఖ రాసినవారిలో చాలా వరకు పార్టీలో సమున్నత స్థానంలో ఉన్న నేతలేనని.. వీరంతా సోనియా గాంధీకి నేరుగా కలవాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేశారు ఖుర్షీద్. నాయకత్వం మార్చడంపైనే లేఖలో సూచనలు చేసినట్లు స్పష్టం చేశారు. తమ దృష్టిలో సోనియా, రాహుల్​ గాంధీలు పార్టీ నాయకులేనని పేర్కొన్నారు. పార్టీకి అత్యంత సుదీర్ఘ కాలం నేతృత్వం వహించిన సోనియాకే నాయకత్వ సమస్య పరిష్కారాన్ని అప్పగించాలని అన్నారు.రాహుల్ గాంధీని కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగాలని కోరే బదులు.. ఆ నిర్ణయాన్ని ఆయనకే వదిలేయాలని సూచించారు ఖుర్షీద్.

 

Read more RELATED
Recommended to you

Latest news