చాణక్య నీతి : ఒక వ్యక్తి మంచివాడా చెడ్డవాడా తెలుసుకోవడమెలా..?

-

పురాణాల్లో ఎంతమంది గొప్పవాళ్లు, మేధావులు, జ్ఞానులు, మహనీయులు చెప్పిన మాటలు, వ్యాఖ్యాలు, రాసిన గ్రంథాలు ఉన్నా.. ఇప్పటి జనరేషన్‌ కూడా గుర్తించి, గుర్తుపెట్టుకుని, పాటిస్తున్న విషయం ఏదైనా ఉందంటే అది చాణక్య నీతి. చాణక్యుడు, కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు.. ఇలా మూడు పేర్లతో ఎన్నో కళలు, ఎంతో జ్ఞానం ఉన్న వాడు కౌటిల్యుడు. అదేనండి మన చాణక్యుడు. చాణక్యుడు ఓ రాజకీయవేత్త, వ్యూహకర్త, ఆర్థికవేత్త, దౌత్యవేత్త. ఎన్నో గ్రంథాలను రచించి మరో లక్ష సహస్రాబ్ధాల జనరేషన్లు కూడా పాటించగలిగే గ్రంథాలు రచించాడు. అందులో చాణక్య నీతి ఒకటి. చాణక్య నీతిలో మానవ జీవితానికి సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావించాడు. ఈ విధానాలు నేటికీ అనుసరణీయం.

కొన్నిసార్లు మనకు బాగా దగ్గరైనవాళ్లే మనల్ని దారుణంగా మోసం చేస్తారు. వాళ్లలో ఆ కోణం మనమెప్పుడూ చూసుండం. వాళ్లెంత మంచివాళ్లు అనుకుంటామో.. చివరకు నిజస్వరూపం తెలిశాక అంత బాధపడతాం. ఇలా జరగకూడదంటే ఓ వ్యక్తి తన స్నేహితుడా.. శత్రువా.. అతడు మంచి వ్యక్తా లేక చెడు మనిషా తెలుసుకోవాలి. మంచి, చెడుల మధ్య వ్యత్యాసం గుర్తించాలి. మనకు అయిన వారెవరు కాని వారెవరో ఎలా గుర్తించాలి. దీనికి సంబంధించిన విషయాలను కౌటిల్యుడు తన చాణక్య నీతి గ్రంథంలో ప్రస్తావించాడు.

చాణక్యుడి ప్రకారం మీరు ఒక వ్యక్తిని పరీక్షించాలనుకుంటే, అతని త్యాగ స్ఫూర్తిని చూడండి. ఒక వ్యక్తి తన ఆనందాన్ని ఇతరుల సంతోషం కోసం త్యాగం చేస్తే, అలాంటి వ్యక్తి ఎప్పుడూ మోసం చేయడు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు దాటేయకుండా మీకు అండగా నిలబడితే ఆ వ్యక్తి మంచివాడని అర్థం. లేదా అతన్ని దూరంగా ఉంచడం ఉత్తమమని చాణక్యుడు చెప్పాడు.

ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం, వాళ్లకి చెడు జరగాలని కోరుకోవడం లాంటివి చేస్తే అలాంటి వ్యక్తి నమ్మదగిన వాడుకాదు. తమ స్వార్థం కోసం చూసుకునే వారు ఇతరులను ఇబ్బంది పెడతారు. అనుకోని సమయం వస్తే తమ స్వార్థం కోసం వాళ్లు ఏమైనా చేస్తారు. అందుకే అలాంటి వాళ్లకి దూరంగా ఉండమని సూచించాడు చాణక్యుడు. ఇలా మన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను చాణక్యుడు తన గ్రంథాల్లో పొందుపరిచాడు.

Read more RELATED
Recommended to you

Latest news