మండలిలో ట్విస్ట్…క్యాబినెట్‌లో బండాకు నో ఛాన్స్?

-

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎంపిక విషయంలో ట్విస్ట్‌లు కొనసాగుతూనే ఉన్నాయి. అలాగే ఎవరికి ఎమ్మెల్సీ ఇచ్చి…ఎవరిని క్యాబినెట్‌లో తీసుకుంటారో కూడా క్లారిటీ రావడం లేదు. తాజాగా ఎమ్మెల్యే కోటాలో ఆరుగురు ఎమ్మెల్సీలని ఖరారు చేసిన విషయం తెలిసిందే. పాడి కౌశిక్ రెడ్డి, త‌క్కెళ్ల‌ప‌ల్లి రవీందర్ రావు, మాజీ కలెక్టర్ వెంక‌ట్రామిరెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, బండ ప్రకాష్‌లకు ఎమ్మెల్సీలు ఖరారు చేశారు. ఇక స్థానిక సంస్థల కోటాలో ఉన్న 12 స్థానాలకు ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తిగా మారింది.

ఇదిలా ఉంటే ఇటీవల గవర్నర్ కోటాలో ఉన్న ఒక ఎమ్మెల్సీ స్థానానికి కౌశిక్ రెడ్డిని నామినేట్ చేసిన విషయం తెలిసిందే. అయితే కౌశిక్‌కు ఎమ్మెల్సీ ఇచ్చే విషయంలో గవర్నర్ అభ్యంతరం చెప్పారు. దీంతో కౌశిక్‌కు ఎమ్మెల్యేల కోటాలో పదవి ఫిక్స్ చేశారు. ఇప్పుడు గవర్నర్ కోటాలో మాజీ స్పీకర్ మధుసూదనాచారికు ఎమ్మెల్సీ సిఫారసు చేస్తూ గవర్నర్‌కు ఫైలు పంపారు. ఇక ఈయనకు ఎమ్మెల్సీ ఖరారైనట్లే.

అయితే మధుసూదనాచారి తెరపైకి రావడంతో ఇప్పుడు మండలి ఛైర్మన్ విషయంలో ట్విస్ట్‌లో చోటు చేసుకుంది. మొన్నటివరకు కడియం శ్రీహరి లేదా గుత్తా సుఖేందర్ రెడ్డిల్లో ఒకరికి ఛైర్మన్ పదవి దక్కొచ్చని ప్రచారం జరిగింది. అలాగే రాజ్యసభ నుంచి ఎమ్మెల్సీకు వచ్చిన బండా ప్రకాష్‌ని క్యాబినెట్‌లోకి తీసుకుంటారని టాక్ నడిచింది. ఎందుకంటే ఈటల ప్లేస్‌ని రీప్లేస్ చేయడానికి ముదిరాజ్ వర్గానికి చెందిన ప్రకాష్‌కు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరిగింది.

కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ వచ్చింది. బండ ప్రకాష్‌ని డిప్యూటీ ఛైర్మన్ చేస్తారని తెలుస్తోంది. ఇక ఛైర్మన్‌గా మధుసూదనాచారిని చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అటు గుత్తా సుఖేందర్ రెడ్డిని క్యాబినెట్‌లోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కడియం కూడా క్యాబినెట్ రేసులో ఉన్నారు. మరి చూడాలి కేసీఆర్…ఎవరిని ఎలా సెట్ చేస్తారో?

Read more RELATED
Recommended to you

Latest news