Cyber Crime : మాంత్రికుడి కోసం వెతికితే మాయ చేసి లక్షలు దోచేశారు

-

ప్రేమ సమస్య నుంచి బయటపడేందుకు గూగుల్‌లో మాంత్రికుడి కోసం వెతికిన వైద్యురాలికి నైజీరియన్‌ రూ.సుమారు 12.45 లక్షలు టోకరా వేశాడు. ఈ ఘటన హైదరాబాద్​ చోటుచేసుకుంది. కుషాయిగూడకు చెందిన కంటి వైద్యురాలు తన ప్రేమ వ్యవహారంలో ఎదురవుతున్న సమస్యలు, వృత్తిపరంగా విజయం సాధించేందుకు సలహాలు, పరిష్కారం కోసం గూగుల్‌లో వెతికారు.

ఓ ఫోన్‌ నంబరు కనిపించడంతో ఫోన్‌ చేయగా.. ఉగాండాకు చెందిన వ్యక్తితో ప్రార్థనలు చేయించి సమస్య పరిష్కరిస్తానంటూ మభ్యపెట్టారు. రూ.12.45 లక్షలు వసూలు చేశారు. మోసపోయినట్లు గ్రహించి సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించగా ఒక్వుచుక్వు, ఉజకలను దిల్లీలో అరెస్టు చేశారు. మరో ఇద్దరు పారిపోయినట్లు రాచకొండ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ ఎస్వీ హరికృష్ణ తెలిపారు.

నైజీరియాకు చెందిన ఒక్వుచుక్వు(41), జోనాథన్‌ ఉజక(35), మైఖేల్‌ అజుండా, డేనియల్‌, వస్త్రాల వ్యాపారం నిమిత్తం కొన్నేళ్ల క్రితం భారత్‌కు వచ్చి నష్టపోయారు. సులువుగా డబ్బు సంపాదించేందుకు దిల్లీ కేంద్రంగా మోసాలు ప్రారంభించారు. ఏ సమస్యకైనా పరిష్కారం చూపిస్తామంటూ ఇంటర్‌నెట్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోన్‌ నంబర్లు ఉంచారు. సంప్రదించిన వారిని మాయమాటలతో నమ్మించి డబ్బు లాగుతున్నారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news