ముంబయిలో 2008 నవంబరు 26 తరహా ఉగ్రదాడులకు పాల్పడతామంటూ ట్విటర్ వేదికగా మరోసారి బెదిరింపులకు తెగబడ్డారు కొందరు గుర్తుతెలియని వ్యక్తులు. ఆ ట్వీట్లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘ది ఎటాక్స్ ఆఫ్ 26/11’ సినిమా పోస్టర్ను ఉపయోగించారు. ‘మూవీ రెండో భాగం ఎప్పుడు విడుదలవుతుంది?’ అని అందులో రాసి ఉంది. ఈ ట్వీట్ శుక్రవారం రాత్రి వచ్చిందని పోలీసులు తెలిపారు.
ఈ ట్వీట్లో గుజరాత్లోని ఓ వ్యక్తి పేరు, చిరునామా ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఈ బెదిరింపులు బూటకమని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం దీనిపై క్రైమ్ బ్రాంచ్ విచారణ జరుపుతోంది. శుక్రవారం కూడా ఓ గుర్తుతెలియని వ్యక్తి ఎన్ఐఏకు మెయిల్ చేశాడు. తనకు తానే తాలిబన్ను అని చెప్పుకుంటూ.. ముంబయిలో దాడులకు పాల్పడతానని బెదిరించాడు. ఈ వరుస బెదిరింపులతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ విషయంలో ఎన్ఐఏ ముంబయి పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అప్రమత్తమైన పోలీసులు ముంబయికి ఎలాంటి ప్రమాదం లేదంటూ.. నగరవాసులకు అండగా తాము ఉన్నాంటూ భరోసానిచ్చారు.