TSPSC సభ్యుల నియామకంపై పునస్సమీక్షించండి.. హైకోర్టు ఆదేశాలు

-

టీఎస్‌పీఎస్సీ సభ్యుల నియామక ప్రక్రియపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియను పునస్సమీక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుప్రీంకోర్టు పేర్కొన్నట్లు.. కీలక పదవుల భర్తీకి నిబంధనలు లేనప్పుడు, చిత్తశుద్ధితో కసరత్తు చేయకుండా నియామకాలు చేపట్టరాదని తెలిపింది. అందువల్ల నియామక ప్రక్రియను మూడు నెలల్లోగా పునఃపరిశీలించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. టీఎస్‌పీఎస్సీ సభ్యులను నియమిస్తూ 2021 మే 19న జారీ చేసిన జీవో 108ను ఈ దశలో రద్దు చేసే ప్రశ్న ఉత్పన్నం కాదని, అయితే వారి నియామకాలు రాష్ట్ర ప్రభుత్వ తాజా పరిశీలనకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది.

టీఎస్‌పీఎస్సీ సభ్యులను నిబంధనలకు విరుద్ధంగా నియమించారంటూ హైదరాబాద్‌కు చెందిన ప్రొఫెసర్‌ ఎ.వినాయక్‌రెడ్డి 2021 జూన్‌లో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ సి.వి.భాస్కర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం సుదీర్ఘ వాదనల అనంతరం గత ఏడాది డిసెంబరులో తీర్పును వాయిదా వేసింది. దీనిపై శుక్రవారం 80 పేజీల తీర్పు వెలువరించింది. సర్వీసు వ్యవహారమైనప్పటికీ రాజ్యాంగసంస్థ సభ్యుల నియామకమైనందున పిటిషన్‌ విచారణార్హమేనని తేల్చి చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news