పాదచారులపై దూసుకెళ్లిన లారీ.. 48 మంది దుర్మరణం

-

రోడ్డుపై నడుస్తున్న పాదచారులపైకి అటుగా వస్తున్న ఓ లారీ దూసుకెళ్లడంతో 48 మంది దుర్మరణం చెందారు. ఈ దారుణ ఘటన పశ్చిమ కెన్యాలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం సాయంత్రం లోండియానిలోని రిఫ్ట్ వ్యాలీ.. కెరిచో-నకురు మధ్య ఉన్న హైవేపై కెరీచో వైపునకు వెళ్తున్న ఓ లారీ అదుపు తప్పి.. అక్కడే ఉన్న చిరు వ్యాపారులతో పాటు బస్​ స్టాండ్​లో వేచి ఉన్న స్థానికుల పైకి దూసుకెళ్లింది. దీంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది. రోడ్డుపై ఉన్న వాహనాలు ధ్వంసమయ్యాయి.

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించారు. గాయపడ్డ వారిని పోలీసులు చికిత్స కోసం స్థానికంగా ఉన్న వివిధ ఆస్పత్రులకు తరలించారు. ధ్వంసమైన వాహన శకలాల కింద ఇంకొంత మంది చిక్కుకుని ఉన్నారని పోలీసులు తెలిపారు. జోరు వర్షం పడుతూ ఉండడం సహా ఆ ప్రాంతమంతా చీకటిగా ఉన్నందున మృతుల సంఖ్యను ఇప్పట్లో నిర్ధరించలేమని.. దానికి ఇంకాస్త సమయం పడుతుందని చెప్పారు. వర్షం వల్ల సహాయక చర్యల్లో అంతరాయం కలిగిందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news