ఈ ఏడాది ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ఇప్పటికే ఐఎండీ సహా అంతర్జాతీయ వాతావరణ సంస్థలు వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా అత్యంత ఉష్ణోగ్రత కలిగిన రోజుగా జులై 22వ తేదీ రికార్డు సృష్టించినట్లు ఐరోపా సమాఖ్యకు చెందిన కోపర్నికస్ క్లైమేట్ ఛేంజ్ సర్వీస్ (సీ3ఎస్) తెలిపింది. ఆ రోజున ప్రపంచ సరాసరి సగటు ఉష్ణోగ్రత 17.15 డిగ్రీల సెల్సియస్గా నమోదైనట్లు వెల్లడించింది. ఈ నెల 21వ తేదీన రికార్డు సృష్టిస్తూ నమోదైన 17.09 డిగ్రీలను ఇది మించిపోయిందని పేర్కొంది.
గత జూన్ నుంచి ప్రతినెలా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న విషయం తెలిసిందే. 1940 నుంచి ఇప్పటి వరకూ ఈ నెల 22న నమోదైన సగటు ఉష్ణోగ్రతే అత్యధికమని ఈ నివేదిక తెలిపింది. ఇప్పటి వరకూ 2023, జులై 6నాటి 17.08 డిగ్రీలు, 2024 జులై 21 నాటి 17.09 ఉష్ణోగ్రతలే గరిష్ఠంగా ఉన్నట్లు పేర్కొంది. కొత్త రికార్డులు సృష్టిస్తూ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న క్రమంలో తాజా తాపస్థాయి రికార్డులు బద్దలు కొట్టినట్లు చెప్పింది.