రంగారెడ్డి జిల్లా శామీర్పేటలో వ్యవసాయదారుల సేవా సహకార సంఘంపై నర్సింలు యాదవ్ ఆధ్వర్యంలో పది మందికిపైగా కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంటే.. సహకార సంఘంలో మాజీ ముఖ్యమంత్రి ఫొటో ఎలా పెడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఫొటోనే ఉండాలంటూ అద్దాలపై ఉన్న కేసీఆర్, నాటి ప్రభుత్వ పథకాల స్టిక్కర్స్, ఫ్లెక్సీ లు చించేశారు. అడ్డు వచ్చిన సిబ్బందిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు.
దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు, బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. సహకార సంఘం కార్యాలయంపై దాడి చేసిన వారిలో ఏఎంసీ ఛైర్మన్ బొమ్మల పల్లి నర్సింలు యాదవ్, కాంగ్రెస్ పార్టీ శామీర్ పేట్ మండల అధ్యక్షుడు వైఎస్ గౌడ్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గడ్డం రమేష్, మాజీ ఎంపీటీసీ సాయిబాబు, శామీర్ పేట్ గ్రామ అధ్యక్షుడు ఆంజనేయులు, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బండి శ్రీకర్ రెడ్డి, నర్సింహా రెడ్డి, నాగరాజు, కార్యకర్తలు ఉన్నారు.