ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేవాదాయ శాఖలో సమగ్ర అభివృద్ధి చర్యలకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో, మొత్తం 137 పోస్టుల భర్తీకి ఆయన ఆమోదం తెలిపారు. ఇందులో డిప్యూటీ కమిషనర్, ఈవో గ్రేడ్ 1 మరియు గ్రేడ్ 3 స్థాయిల ఖాళీలు ఉన్నాయి. అంతేకాక, 200 మంది వైదిక సిబ్బందిని నియమించేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇకపోతే, 16 ఆలయాల్లో నిత్య అన్నదాన పథకాన్ని ప్రారంభించాలన్న నిర్ణయం తీసుకున్నారు. అదనంగా, రాష్ట్రంలోని 23 ప్రధాన దేవాలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు.
ఆలయాల అభివృద్ధిని ఆగమశాస్త్ర ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. భక్తుల భావాలను గౌరవిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు. దేవాలయ భూముల్లో కేవలం శాఖాహార హోటళ్లకే అనుమతులు ఇచ్చాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో దేవాదాయ శాఖ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.