భారత రాజకీయ యవనికపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో అరుదైన మైలురాయిని చేరుకున్నారు. ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా సుదీర్ఘకాలం పాటు ప్రభుత్వాధిపతిగా సేవలు అందించిన వ్యక్తిగా ఆయన సరికొత్త చరిత్ర సృష్టించారు. ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాని రీతిలో, విరామం లేకుండా ప్రజలకు సేవ చేస్తూ సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ఈ అసాధారణ విజయం పట్ల దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆయనకు అభినందనలు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగాప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
భారతదేశంలో ఒక రాష్ట్రానికి లేదా దేశానికి అత్యధిక కాలం ప్రభుత్వాధిపతిగా ఉన్న రికార్డు ఇప్పటివరకు సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉండేది. ఆయన వరుసగా 8,930 రోజుల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే, నరేంద్ర మోదీ తాజాగా ఆ రికార్డును అధిగమించారు. అక్టోబర్ 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నేటి వరకు, ఆయన ఏకధాటిగా 8,931 రోజుల పాటు అధికారంలో కొనసాగుతూ వస్తున్నారు. ఇందులో గుజరాత్ సీఎంగా గడిపిన కాలం, భారత ప్రధానిగా కొనసాగుతున్న కాలం రెండూ కలిసి ఉన్నాయి. ఇక ఏమాత్రం విరామం లేకుండా ఇన్ని రోజులు పాలన సాగించడం ఒక అరుదైన విషయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

నరేంద్ర మోదీ రాజకీయ ప్రస్థానం ఒక స్ఫూర్తిదాయకమైన ప్రయాణం. గుజరాత్ను అభివృద్ధి పథంలో నడిపించి ‘గుజరాత్ మోడల్’ను దేశవ్యాప్తం చేయడంలో ఆయన విజయం సాధించారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవంతో 2014లో దేశ పగ్గాలు చేపట్టారు. అప్పటి నుండి వరుసగా మూడు సార్లు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి, దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే ఐదో స్థానానికి చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. ఇన్నేళ్ల సుదీర్ఘ పాలనలో ఆయన అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఇక పాలనలో పారదర్శకత, సాంకేతికతను జోడించి సామాన్యులకు ప్రభుత్వ ఫలాలను నేరుగా అందించడంలో ఆయన చూపిన చొరవ ఈ సుదీర్ఘ విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది.
ప్రధాని మోదీ పాలనలో దేశం డిజిటల్ విప్లవం నుండి అంతరిక్ష ప్రయోగాల వరకు అనేక విజయాలను చవిచూసింది. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారు. మౌలిక సదుపాయాల కల్పన, పారిశ్రామికాభివృద్ధి, స్వయం సమృద్ధి వంటి నినాదాలతో యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. సుదీర్ఘకాలం అధికారంలో ఉండటం వల్ల పాలనలో స్థిరత్వం ఏర్పడి, దీర్ఘకాలిక ప్రాజెక్టులను పూర్తి చేసే అవకాశం లభించిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ రికార్డు కేవలం వ్యక్తిగత విజయం మాత్రమే కాదు, భారత ప్రజాస్వామ్య పటిష్టతకు కూడా నిదర్శనం.
నరేంద్ర మోదీ సాధించిన ఈ 8,931 రోజుల సుదీర్ఘ పాలన రికార్డు భారత రాజకీయ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినది. ప్రజల నమ్మకాన్ని ఇన్నేళ్ల పాటు నిలబెట్టుకోవడం సామాన్యమైన విషయం కాదు. భవిష్యత్తులో కూడా ఆయన నాయకత్వంలో భారత్ మరిన్ని అద్భుతాలు సాధిస్తుందని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.
