గోరుచిక్కుడు సాగుకు సమయం వచ్చేసిందా..? కలుపు, తెగుళ్ల నివారణకు ఇలా చేసేద్దాం..!

-

వచ్చేది వేసవి కాలంలో..ఎండా కాలంలో సాగుకు అత్యంత అనుకూలమైన పంట గోరుచిక్కుడు. కాయగూరగా, పశుగ్రాసంగా, జిగురు ఉత్పత్తి కోసం దేశవ్యాప్తంగా ఈ పంట సాగులో ఉంది. సారవంతం కాని భూముల్లో సైతం ఈ గోరుచిక్కుడు బాగా పండుతుంది. నీటి ఎద్దడిని సమర్థంగా తట్టుకోగలదు. గింజలో 18 శాతం మాంసకృత్తులు, 32 శాతం పీచు పదార్థాలు, 30-33 శాతం జిగురు ఉంటుంది. భారత్ నుంచి విదేశాలకు పంపుతున్న వ్యవసాయ ఉత్పత్తుల్లో గోరుచిక్కుడు జిగురు చాలా ప్రధానమైంది. రాజస్థాన్ లాంటి నీటి ఎద్దడి రాష్ట్రాల్లో రైతులకు మేలైన ఆదాయాన్నిస్తున్న పంట ఇది. తెలంగాణలో పాత నల్గొండ, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల్లో ఈ పంట సాగుకు చాలా అవకాశాలున్నాయి.

ఎలాంటి వాతావరణం అవసరం?

గోరుచిక్కుడు ఉష్ణమండలపు పంట.. సాగుకు వేడి వాతావరణం అవసరం. తొలిదశలో ప్రత్యేకించి మొలకెత్తే సమయంలో పంటకు 30-35 డిగ్రీల సెం.గ్రే. ఉష్ణోగ్రత కావాలి. శాఖీయ దశలో 32-38 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండాలి. పూత దశలో ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటే పంట పొడవుగా పెరుగుతుంది. గాలిలో అధిక తేమతో ఆకుమాడు, వేరు కుళ్లు సమస్య ఎక్కువవుతుంది. నేలలు ఉదజని సూచిక 7 – 8.5 మధ్య ఉండి మధ్యస్త, తేలికపాటి నేలల్లో ఈ పంట బాగా పెరుగుతుంది. నీటి నిల్వ భూములు, నల్లరేగడి భూములు ఈ పంటకు అంతగా అనుకూలించవు. అధికంగా గాలిలో తేమ ఉండే నేలల్లో ఈ పంట వేయకపోవడమే మంచిది.

నేల తయారీ

ముందుగా నేలలో నీరు ఇంకేవిధంగా తయారు చేయాలి. అందుకోసం.. వేసవిలోనే లోతు దుక్కి చేసి, ఆ తర్వాత రెండు, మూడుసార్లు దుక్కిచేయాలి. అప్పుడు నీరు ఇంకేలా నేల తయారీ ఉంటుంది. పప్పుధాన్యపు పంట కాబట్టి భూమిలో నత్రజనిని స్థాపించి భూసారాన్ని పెంచుకోవాలి.

రకాలు

కాయగూరల కోసం పూసా నవబాహార్, పూసా సదా బాహార్, దుర్గా బాహార్ రకాలు;
విత్తనాల జిగురు కోసం హెచ్-365, హెచ్-563, ఆర్సీజ్-1066, ఆర్సీజ్-1003 రకాలు విత్తుకోవచ్చు.
పశుగ్రాసాల కోసం: హెచ్ఎఫ్-119, హెచ్ఎఫ్-156 రకాలు అనువైనవి.

నాటే విధానం:

జనవరి – ఫిబ్రవరి చివరి నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ విత్తనం నాటడం పూర్తిచేయాలి. ఆ తర్వాత విత్తిన పంటలో దిగుబడి తగ్గిపోతుంది. చాలామంది రైతులు విత్తనం వెదజల్లుతుంటారు. అయితే నిపుణుల సిఫార్సు మేరకు ఎకరాలో మొక్కల సాంద్రత ఉండేలా చేసేందుకు, మొలక శాతం పెరిగేందుకు, అంతర సేద్యపు పనులకు వరుసల్లో విత్తాలి. శాఖలు, కొమ్మలు ఉత్పత్తి చేసే రకాలను వరుసల మధ్య 50 సెం.మీ., వరుసల్లో మొక్కల మధ్య 20 సెం.మీ. దూరంతో నాటాలి. ఏక కాండం ఉండే రకాలైతే వరుసల మధ్య 33 సెం.మీ. దూరం సరిపోతుంది. నాగలితో లేదా సీడ్ డ్రిల్తో విత్తనం వేయాలి. ఎకరాకు 8 కిలోల చొప్పున విత్తనం పడాలి. .

కిలో విత్తనానికి 4 గ్రాముల ట్రైకోడెర్మా లేదా 2 గ్రాముల కార్బెండాజిమ్తో శుద్ధిచేయాలి. ఆ తర్వాత రసం పీల్చే పురుగుల మందుతో శుద్ధి చేయాలి. సిఫార్సు చేసిన రైజోబియం జీవన ఎరువును కిలో విత్తనాలకు 40 గ్రాముల చొప్పున పట్టించాలి. 200 గ్రాముల బరువున్న రైజోబియం కల్చరును 200 గ్రా. బెల్లం ద్రావకంతో కలిపి ఒక లీటరు నీటిలో ఉంచి ద్రావణం తయారు చేయాలి. అలాంటి రైజోబియం మిశ్రమ ద్రావణాన్ని విత్తనాలపై పొరగా ఏకరీతిగా పట్టించాలి. ఆ తర్వాత నీడలో అరగంట పాటు అరబెట్టాలి. 24 గంటల్లోపు వీటిని విత్తుకోవాలి.

ఎరువులు

పప్పుజాతి పంట గనుక తొలిదశలో కొద్ది మొత్తంలోనే నత్రజని అవసరం అవుతుంది.. ఎకరాకు 8 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం అవసరం. వీటిని విత్తనం నాటేటప్పుడే వేయాలి. విత్తటానికి 15 రోజుల ముందు ఎకరాకు 5 టన్నులు బాగా చివికిన పశువుల ఎరువు వేయటం చాలా ఉత్తమం..

నీటి యాజమాన్యం:

ఉష్ణ, ఉపఉష్ణ ప్రాంతాల్లో గోరుచిక్కుడును పూర్తిగా వర్షాధారంగా పండించవచ్చు. అయితే పూత, విత్తనం ఏర్పడే దశలో నీటి ఎద్దడి ఉంటే ఒక నీటి తడినివ్వాలి. పంట వ్యర్థాలను ఎకరాకు 1.2 – 2 టన్నుల చొప్పున వేస్తే నేలలో తేమ శాతం పెరుగుతుంది. వర్షాధార పరిస్థితుల్లో పంట విత్తిన 25, 45 రోజుల తర్వాత 0.1శాతం థయోయూరియా పిచికారీ చేస్తే దిగుబడులు బాగా పెరుగుతాయి.

కలుపు నివారణ

గడ్డిజాతి, వెడల్పాటి జాతి కలుపు సమస్య వానాకాలంలో ఎక్కువగా ఉంటుంది.. పంట తొలి 10-15 రోజుల్లో కలుపు నివారణ చేయాలి. 25, 45 రోజుల్లో రెండుసార్లు చేతితో కలుపు తీయాలి. కూలీల కొరత ఉంటే ఎకరాకు 1-1.3 లీటర్ల పెండిమిథాలిన్ కలుపు మందును 200 లీటర్ల నీటిలో కలిపి విత్తనాలు నాటిన రెండు రోజుల్లో పిచికారీ చేయాలి, లేదా పంట విత్తిన తర్వాత 20-25 రోజులకు ఎకరాకు 160 గ్రా. చొప్పున ఇమజితాఫిర్ కలుపు మందును 200 లీటర్ల నీటితో కలిపి పిచికారీ చేసి కలుపు నిర్మూలించుకోవచ్చు.

తెగుళ్ల నివారణకు

ఆల్బర్నేరియా ఆకుమచ్చ: తెగులు లక్షణాలు గమనించిన వెంటనే ఎకరాకు 800 గ్రా. జినెబ్ 200 లీటర్ల నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.

బూడిద తెగులు: నివారణకు ఎకరాకు 8-10 కిలోల గంధకం పొడి లేదా 0.8-3.2 కిలోల తడి గంధకం లేదా లీటరు నీటికి 115 మి.లీ. చొప్పున నోక్యాప్ పిచికారీ చేయాలి.

దిగుబడి: ఎకరాకు వర్షాధార పంటలో 2.8-7.2 క్వింటాళ్లు, నీటి వసతి కింద 4.8-6 క్వింటాళ్లు దిగుబడి వస్తుంది. జిగురు పంట సాగుచేసే రైతులు కొనుగోలుదారులతో ముందస్తుగా ఒప్పందాలు చేసుకోవడం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news