సైకిల్‌పై వచ్చి ఓటేసిన స్టార్ హీరో

-

నేడు దేశంలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీలకు మంగళవారం ఒకే విడతలో పోలింగ్ కొనసాగుతోండగా..అటు ఉత్తర భారత దేశంలో పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో మూడో విడత పోలింగ్ జరుగుతుంది. దక్షిణాదిలో ప్రముఖులు వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక తమిళ స్టార్ హీరో విజయ్ కూడా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

చెన్నైలోని నీలాంకరైలో గల ఓ పోలింగ్‌ కేంద్రానికి తన ఇంటి నుంచి సైకిల్‌పై వెళ్ళిన విజయ్ క్యూలో నిల్చుని తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే హీరో విజయ్ మాత్రం వెరైటీగా సైకిల్‌పై వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. కాగా విజయ్ తన ఇంటి నుంచి సైకిల్ పై బయలు దేరగానే ఆయన అభిమానులు కూడా అతని వెంట బైకులపై వెళ్ళారు. అలానే అభిమానులు ఫొటోలు, వీడియోలు తీసుకొని సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి ఇపుడు వైరల్ గా మారాయి.

అయితే విజయ్ ఇలా సైకిల్‌పై వచ్చి ఓటేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు నిరసనగానే విజయ్‌ ఇలా సైకిల్‌పై వచ్చినట్లు పలు మీడియాల్లో కథనాలు వస్తుండగా… పోలింగ్‌ కేంద్రానికి హీరో విజయ్‌ ఇల్లు దగ్గరగా ఉండటంతో అతడు ఇతర వాహనాలను పక్కన పెట్టి సైకిల్‌పై వెళ్లి ఓటు వేశారని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. మరి కొందరు మాత్రం సోషల్ మీడియాలో హైప్ కోసమే విజయ్ ఇలా చేసాడని విమర్శిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news